Kavitha: మీ పిల్లలు చదివే స్కూల్ లో టాయిలెట్లను మీరు క్లీన్ చేయగలరా? లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పై కవిత ఆగ్రహం (ఆడియో)

by Prasad Jukanti |   (  Updated:2025-05-29 12:37:10  IST  )

గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha: మీ పిల్లలు చదివే స్కూల్ లో టాయిలెట్లను మీరు క్లీన్ చేయగలరా? లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పై కవిత ఆగ్రహం (ఆడియో)
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బోర్డు తుడవడం.. టాయిలెట్ కడగడం ఒకటి కాదని, మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను క్లీన్ చేయగలరా? అది కూడా రెగ్యులర్‌గా? అని ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణిని (Alugu Varshini IAS) ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రశ్నించారు. విద్యార్థులు ఇలాంటి పనులు చేయాల్సిందేనని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గమన్నారు. ఈ వివక్ష నుంచి తప్పించడానికే ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ (Social Welfare Gurukul Society) ఏర్పాటు చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించడం కుల వివక్ష, శ్రమ దోపిడీ అవుతుందన్నారు. ఐఏఎస్ అలుగు వర్షిణి మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో క్లిప్‌ను కవిత తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సదరు అధికారి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రమను గౌరవించడం (డిగ్నిటి ఆఫ్ లేబర్) నేర్పడం, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు వేరు అని అన్నారు. గురుకుల పాఠశాలల్లో మొత్తంగా శానిటేషన్ వర్కర్స్‌ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్‌గా చేయించడం నేరం అని మండిపడ్డారు.

ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం..

ఈ ప్రవర్తన విద్యార్థుల పట్ల వివక్షత, దోపిడీ, వారి హక్కులు, గౌరవం వంటి ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని, ఇది రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరిని నిదర్శనమని కవిత ధ్వజమెత్తారు. వెంటనే ఆ అధికారిని తొలగించి సాంఘిక సంక్షేమ పాఠశాలలను సక్రమంగా నడపడానికి అవసరమైన నిధులు ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోష్ పిల్లలు కాకపోయినా అందరూ పిల్లలు సమాజం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదన్నారు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతోనే ఈ పరిస్థితి:

స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని వీళ్లే టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారని కానీ సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. దాంతో విద్యార్థులనే టాయిలెట్లు, గదులు, పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా రెగ్యులర్ గా చేసుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల లోని వాచ్ మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారన్నారు. ఇప్పటి వరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుందని ధ్వజమెత్తారు. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖి చేసుకునే ఏర్పాటు ఉండాలి తప్ప పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్, శానిటేషన్ వర్కర్స్ చేయించే పని చేయించడం కరెక్ట్ కాదన్నారు. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడాన్ని కవిత తప్పుబట్టారు.

Next Story