Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్

by Prasad Jukanti |

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు.

Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్
X

దిశ బ్యూరో, ఖమ్మం/తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదేపదే సీఎం రంకెలు వేస్తున్నారని, మీతో చర్చకు తాము సిద్ధమని రేవంత్‌రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సవాల్ విసిరారు. మహిళలందరం కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తామని, ఆడబిడ్డలకు ఇస్తామన్న నెలకు రూ.2,500, తులం బంగారం ఎందుకు ఇస్తలేరో చర్చిద్దామన్నారు. అలాగే పింఛన్లు సాయం పెంపుపై కూడా డిస్కస్ చేద్దామన్నారు. ఇవాళ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరన్న, ఆయన అనుచరులు చేరగా వారికి కండువా కప్పి కవిత ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ విషయం తెలుసుకోవాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వకుంటే ఊరుకోం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాని ప్రకారం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఒకవేళ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీలకు లోకల్‌బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ నెల 17వ తేదీన రైల్‌రోకో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని బీసీలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు ఆందోళనలో ఉన్నాయన్నారు. ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు తుమ్మల చొరవ తీసుకోవాలని కోరారు. పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం ఆలయ భూములను చూడటానికి వెళ్లిన తెలంగాణ బీసీ ఆడబిడ్డ, ఈవో రమాదేవిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. భద్రాచల రాముడు తెలంగాణ దేవుడని వ్యాఖానించారు.

Next Story