మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. కాసాని జ్ఞానేశ్వర్

by Dishafeatures2 |
మార్చి 29న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవ సభను తెలంగాణలో నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మార్చి 29వ తేదీన ఆవిర్భావ దినోత్సవ సభ జరగనున్నట్లు తెలిపారు. సభను విజయంతంగా నిర్వహించేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని, తెలుగు రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి 15 వేల మంది ప్రతినిధులు సభలో పాల్గొననున్నారని తెలిపారు.

రాష్ట్ర విభజనానంతరం మొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు ఈ సభకు హాజరవుతున్నందున ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పార్టీ సభకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కమిటీలకు తెలిపారు. ఇందుకోసం సభ ప్రాంగణంలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి సభను విజయవంతం చేయాలని ఆయా కమిటీలను ఆదేశించారు. తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సభకు హాజరు కావాలని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులు దీనిపై బాధ్యత తీసుకుని పనిచేయాలని అన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులకు ఘనమైన నివాళులను అర్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ దిశగా నగర నాయకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహనరావు, జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed