నకిలీ ఏజెంట్ల ఉచ్చులో యువత బలి

by Disha Web Desk 9 |
నకిలీ ఏజెంట్ల ఉచ్చులో యువత బలి
X

దిశ, రుద్రంగి: నకిలీ ఏజెంట్ల మోసాలకు రుద్రంగి మండల కేంద్రంలో యువత బలవుతున్నారు. నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు మానాల గ్రామంలో అధిక మొత్తంలో యువత గల్ఫ్ దేశాలకు వెళ్తారు. వారిని ఆసరాగా చేసుకొని నకిలీ ఏజెంట్లు ఫలానా కంపెనీలో మీకు వేలాల్లో జీతం ఉంటుందని ఆశ చూపి వారి పాస్పోర్ట్ లను ముందే తీసుకొని లక్షల మొత్తంలో డబ్బులు దండుకొని గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏజెంట్ చెప్పిన జీతం ఉండకపోవడంతోపాటు ఇండియా లో చెప్పిన పనులకు కాకుండా వేరే పనులలో పెడుతున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కొందరు అక్కడే పని చేస్తూ కొంతమంది పనులు చేయలేక ఇంటి ముఖం పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఐదుగురు మాత్రమే లైసెన్స్ ఏజెంట్లు ఉన్నారు. నకిలీ ఏజెంట్లు లైసెన్సులతో సంబంధం లేకుండా అవన్నీ మామూలే అనే విధంగా ఏజెంట్లు వ్యవహరిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. యువత ఆచూకీ చెప్పని ఏజెంట్లు మండలంలోని వీరునితండా గ్రామానికి చెందిన గుగులోత్ దేవదాస్ వయస్సు 23 సంవత్సరాలు. అతనిని కథలాపూర్ మండలానికి చెందిన ఓ ఏజెంట్ ఇరాక్ దేశానికి పంపిస్తానని రెండు లక్షల రూపాయలు వసూలు చేశాడు. కొడుకు దేశం వెళ్తున్నాడు కదా అని తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఏజెంట్ కి చెల్లించారు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకు అతని జాడ లేదు. అక్కడ ఉన్న కొందరి సమాచారం మేరకు లక్ష రూపాయలు కడితే మీ కొడుకుని వదిలేస్తాం అని అంటే ఆ డబ్బులు కూడా ఏజెంట్ కి కట్టారు. ఏడు నెలలు అయినా తన కొడుకును ఇండియాకు రప్పించలేదని తల్లిదండ్రులు వాపోయారు. తన కొడుకు ఎక్కడ ఉన్నాడో... ఏం చేస్తున్నాడోని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంత్రులు కేటీఆర్, బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని తన కొడుకును ఇండియాకు రప్పించాలని వారు కోరారు. నకిలీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి తందండ్రులు కోరుతున్నారు.



Next Story