Kalvakuntla Kavitha : అక్కడ కవిత ప్రాబల్యం తగ్గుతుందా?!

by Disha Web Desk 12 |
Kalvakuntla Kavitha : అక్కడ కవిత ప్రాబల్యం తగ్గుతుందా?!
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చే పేరు కల్వకుంట్ల కవిత. పార్టీ కండువా వేసుకునే కార్యకర్తలు తప్ప లీడర్లు లేని రోజుల్లో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జగిత్యాలలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేవారు. అయితే కవిత జగిత్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాక పోయినా ఎన్నికల్లో గత సంప్రదాయాలకు భిన్నంగా రాష్ట్రంలో రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా జగిత్యాలలోనూ గులాబీ జెండా ఎగిరింది.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడిని మట్టి కరిపించడం అనుకున్నంత ఈజీ కాదు. అటువంటిది 60 వేల మెజారిటీతో జీవన్ రెడ్డిని చిత్తుగా ఓడించి జగిత్యాలపై కవిత తన మార్క్‌ను చాటుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్‌పై కవిత ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వీడకుండా విస్తృత పర్యటనలు చేస్తూ వచ్చిన కవిత గత కొద్దికాలంగా జగిత్యాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో అటు పార్టీ, ఇటు కేడర్‌లోను అయోమయం నెలకొన్నది.

కారణం అదేనా..?

ఎంపీగా ఓటమిపాలైనప్పటికీ నిరాశ చెందకుండా బీజేపీ నేతలు జైశ్రీరామ్ అంటే జై హనుమాన్ అనే నిదానంతో ఏ మాత్రం వెనక్కు తగ్గని కవిత ఉన్నట్టుండి జగిత్యాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఏ చిన్న సందర్భం వచ్చినా జగిత్యాలలో పర్యటించిన కవిత ఇప్పుడు దూరంగా ఉండడంపై కార్యకర్తలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాం అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి ఈ గ్యాప్ మరింత ఎక్కువైంది.

ఎలక్షన్ ఇయర్ కావడంతో కవిత నియోజకవర్గానికి దూరంగా ఉంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కవిత క్యాడర్ మొత్తం యూ టర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే కవిత వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉందని అందుకే జగిత్యాలకు దూరంగా ఉంటూ వస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మంత్రి కొప్పుల భర్తీ చేస్తారా..?

రాజకీయ సంచలనాలకు కేరాఫ్‌గా ఉన్న జగిత్యాల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చేవారు. ఇటీవల కాలంలో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రోళ్ల వాగు ప్రాజెక్టు విషయంలో కవిత స్పందించ లేదు. ఒక దశలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య హోరాహోరీ సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచినప్పటికీ కవిత మౌనంగానే ఉన్నారు. మంత్రి కొప్పుల మాత్రమే జిల్లాలోని తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు.

ముఖ్యమంత్రి తనయగా ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వగలిగిన కవిత అవసరమైతే అభివృద్ధి విషయంలో స్పష్టమైన హామీలు సైతం ఇవ్వగలిగేదని, అటువంటి కవిత స్థానాన్ని మంత్రి కొప్పుల భర్తీ చేయగలుగుతారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనకంటూ ప్రత్యేక క్యాడర్ మెయిన్‌టైన్ చేస్తున్న కవిత ఒక్కసారిగా సైలెంట్ అవడంతో ప్రతిపక్ష నాయకులు తమ బలాన్ని పెంచుకునే విధంగా స్ట్రాటజీలు రెడీ చేసుకుంటున్నారు.

Next Story