మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?

by Ratna Kumari |

తమ వైఫల్యాలను ప్రభుత్వంపై రుద్దేందుకు సంఘాల పేరుతో కొందరు ఆడుతున్న కపటనాటకాలను జర్నలిస్టు సమాజం గమనిస్తూనే ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం

మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?
X

దిశ, కరీంనగర్ టౌన్ : తమ అసమర్ధతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు జర్నలిస్టుల సమస్యలపై భారీ ధర్నా పేరుతో కొత్త నాటకాలకు తెరతీసారని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆరోపించారు. వాస్తవానికి ఈ నాయకుల కారణంగానే రాష్ట్రంలోని మెజారిటీ జర్నలిస్టులు ప్రభుత్వానికి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ప్రభుత్వానికి మధ్య అగాథం పెంచి ప్రస్తుతం దానిని తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం కరీంనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రాకపోవడానికి కారణాలు, కారకులు ఎవరని ప్రశ్నించారు. అక్రిడిటేషన్ విధివిధానాలు నిర్ధారించడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంతకాలం ఏం చేసిందని? ప్రశ్నించారు.అక్రిడిటేషన్ విధివిధానాల రూపకల్పన పూర్తయిందా? సంబంధిత నివేదిక ప్రభుత్వానికి సమర్పించారా? సమర్పిస్తే ప్రభుత్వమే కాలయాపన చేస్తుందా? వీటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత రూపకల్పన కమిటీకి చైర్మన్గా ఉన్న వ్యక్తిపై ఉందన్నారు.

తమ వైఫల్యాలను ప్రభుత్వంపై రుద్దేందుకు సంఘాల పేరుతో కొందరు ఆడుతున్న కపటనాటకాలను జర్నలిస్టు సమాజం గమనిస్తూనే ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో సమాచార శాఖ వైఫల్యం చెందిందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు మాట్లాడడం, ప్రభుత్వ చలువతో అధికారంలోకి ఉండి అదే ప్రభుత్వం పై ధర్నాలకు ప్రోత్సహించడం కన్న విడ్డూరం మరొకటి ఉండబోదన్నారు. మీడియా అకాడమీ నిర్దిష్టమైన లక్ష్యాలతో ఏర్పడిందని, దానికి చైర్మన్ గా నియమించే వ్యక్తులకు ఆ బాధ్యతలు కాకుండా సమాచార శాఖ నిర్వహించే బాధ్యతలు కూడా అప్పగించడం ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన అన్నారు.ఇకపై మీడియా అకాడమీకి నియమించే వ్యక్తులను కేవలం అకాడమీ పనులకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాహితం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులకు తెలంగాణ జర్నలిస్టుల మద్దతు కూడ కట్టడంలో వైఫల్యం చెందిన కొందరు నాయకులు ఒకటి రెండు నెలల్లో ముగియబోతున్న తమ పదవులు కాపాడుకునేందుకు కొత్త వేషాలతో ముందుకు వస్తున్న విషయాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టులు గమనించాలన్నారు. అలాంటి వ్యక్తులు జర్నలిస్టు సంఘాల కంటే, డ్రామా కంపెనీలు నడుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ సమావేశంలో డబ్ల్యుజేఐ జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మొగురం రమేష్, కోశాధికారి చిటుమల్ల మహేందర్ పాల్గొన్నారు.

Next Story