హుజూరాబాద్ లో నీటి క‌ట‌క‌ట‌..!

by Ratna Kumari |

హుజురాబాద్ పట్టణంలో ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ లో నీటి క‌ట‌క‌ట‌..!
X

దిశ, ​హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బందులు మరింత అధికమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన తాగునీటి సరఫరా, ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పరిపాలనా వైఫల్యమే కారణం..


​పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా రోజుకు రూ.60 నుంచి 70 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటి సరఫరా జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 38 లక్షల లీటర్లకే పరిమితమవడం ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని కౌశిక్ రెడ్డి విమర్శించారు. కనీసం ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లను కూడా సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పట్టణంలోని అనేక కాలనీల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి బిందెలతో వీధుల్లో ఎదురుచూడాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీరు కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని,అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, హుజురాబాద్ పట్టణానికి పూర్తి స్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అత్యవసర చర్యలు చేపట్టాలి." అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

అధికారులకు కీలక ఆదేశాలు

​పట్టణంలో నీటి సమస్య తీవ్రతపై స్పందించిన ఎమ్మెల్యే.. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, గతంలో మాదిరిగానే సరిపడా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి క్రమబద్ధంగా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలపై తాము ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటామని, హుజురాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Next Story