టికెట్ ఇస్తానని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-03 14:24:23  IST  )

చొప్పదండి మున్సిపాలిటీలో చైర్మెన్ అభ్యర్థి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. బీ ఫామ్ ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ - కోమలత దంపతులు తీవ్ర నిరసనకు దిగారు.

టికెట్ ఇస్తానని మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో నిరసన
X

దిశ, గంగాధర : చొప్పదండి మున్సిపాలిటీలో చైర్మెన్ అభ్యర్థి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. బీ ఫామ్ ఇప్పిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు బీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ - కోమలత దంపతులు తీవ్ర నిరసనకు దిగారు. టికెట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగుతామని హెచ్చరిస్తూ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. మహేష్ - కోమలత దంపతులు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ ఎస్సీ మహిళ రిజర్వేషన్ కావడంతో బీఆర్‌ఎస్ బిఫామ్ ఇస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తమను గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని తన నివాసానికి పిలిపించుకుని అవమానించారని ఆరోపించారు. చివరి క్షణంలో కేటీఆర్ చెప్పారని చెప్పి, తమకు కాకుండా వేరే వ్యక్తికి బిఫామ్ కేటాయించారని తెలిపారు. టికెట్ ఖరారైనట్లు చెప్పి ఇంటికి పిలిపించుకుని చివరకు ఇలా మోసం చేయడం, తమను తీవ్రంగా అవమానించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. “మమ్మల్ని ఇంటికి పిలిచి ఇంతటి అవమానం చేయడం ఏమిటి? న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగుతాం” అంటూ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ నిబంధనల ఉల్లంఘన వల్లే బీ - ఫామ్ నిరాకరణ

ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. టికెట్ కేటాయింపుల విషయంలో పార్టీ నాయకుల తీరుపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసే సంఘటన వివిధ సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాముఖ్యంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని శాంతింపజేసి పంపించారు. టికెట్ వివాదంపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వివరణ కోరగా.. టికెట్ మోసం చేశారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే తెలిపిన ప్రకారం.. చొప్పదండి మున్సిపాలిటీలో నాలుగో వార్డు ఎస్సీ జనరల్‌, రిజర్వ్ అయి ఉండగా, ఐదో వార్డు ఎస్సీ మహిళ చైర్మెన్ అభ్యర్థి. కాగా మహేష్ - కోమలత దంపతులు ఎస్సీ జనరల్‌లో నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ వేయడంతో పార్టీ పరంగా బీ–ఫామ్ ఇవ్వడం నిరాకరించాల్సి వచ్చిందని వివరించారు. రిజర్వేషన్ ఉన్న వార్డును వదిలిపెట్టి జనరల్ లేదా ఇతర కేటగిరీ వార్డులో పోటీ చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇదే కారణంగా బీ–ఫామ్ ఇవ్వలేకపోయామని, ఇందులో వ్యక్తిగతంగా తమ పాత్ర ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Next Story