దళితబంధుతో రైస్ మిల్ పెట్టాలనే ఆలోచన గొప్పది : మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
దళితబంధుతో రైస్ మిల్ పెట్టాలనే ఆలోచన గొప్పది : మంత్రి కేటీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాష్ట్రంలో దళితబంధు నిధులతో నిర్మించిన మొట్టమొదటి రైస్ మిల్లును మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, సుదామల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య గ్రూపు కలిసి రైల్ మిల్లును నిర్మించారు.

రాజేశ్వరి భర్త సురేందర్, లింగయ్యలకు ఇప్పటికే లారీలు ఉన్నాయి. ఇక విజయ్ కుమార్ గల్ఫ్ నుంచి తిరిగొచ్చాడు. రూ.30లక్షలకు మల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ముగ్గురికి దళిత బంధు స్కీమ్ ద్వారా వచ్చిన రూ.30లక్షలతో పాటు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని రైల్ మిల్లును నిర్మించుకున్నారు. ఇటీవలే ఈ రైస్ మిల్లు నిర్మాణం పూర్తి కాగా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద‌ళితులు ఆర్థికంగా సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు.

ద‌ళితబంధు లబ్ధిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దళిత సాధికార‌త‌కు ద‌ళిత బంధు ఎంతో దోహ‌దపడుతోందని పేర్కొన్నారు. దళితబంధుతో రైస్ మిల్ ను స్థాపించాలనుకోవడం గొప్ప నిర్ణమయమని లబ్ధిదారులను ఆయన కొనియాడారు. యూనిట్ కు బీమా చేపించాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. యూనిట్ చాలా గొప్పగా వచ్చిందని, రైస్ మిల్ విజయవంతంగా నడవాలని ఆకాక్షించారు.


Next Story

Most Viewed