ఇంజక్షన్ వికటించి యువకుడి మృతి..?

by Disha Web Desk 11 |
ఇంజక్షన్ వికటించి యువకుడి మృతి..?
X

దిశ, కోనరావుపేట: గ్యాస్టిక్ సమస్యతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఓ యువకుడు తీసుకున్న ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, కొండాపూర్ గ్రామ హనుమాన్ తండాలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హనుమాన్ తండాకు చెందిన లకావత్ తిరుపతి (27) గ్యాస్టిక్ సమస్యతో చాతి నుంచి పొట్ట వరకు నొప్పి వచ్చింది. దీంతో నిమ్మపెళ్లి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఇంజక్షన్ తీసుకున్నాడు. ఆ ఇంజక్షన్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే తిరుపతి అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటా హుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ ఇంజక్షన్ వేయడం వలనే అది వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

తిరుపతి మృతదేహాన్ని ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపడతామని మృతుడి బంధువులు వెళ్తుండగా, విషయం తెలుసుకున్న పోలీసులు మార్గమధ్యలో కొలనూరు గ్రామ శివారుకి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుడి బంధువులకు వాగ్వాదం జరిగింది. బాధితుని బంధువులు, గ్రామస్థులు రోడ్డు పైన బైఠాయించారు. కాసేపటికీ పోలీస్ అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలను వెల్లడిస్తామని సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ, ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్, వైద్యం వికటించి యువకుడి మృతికి కారణమైన నిమ్మపెల్లిలోని ఆర్ఎంపీ చేపురి ప్రసాద్ క్లినిక్ సీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే మృతుడి భార్య భారతి తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో బంధువుల రోదనలతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed