ఇరు వర్గాల ఘర్షణ.. యువకుడి మృతి

by Disha Web Desk 1 |
ఇరు వర్గాల ఘర్షణ.. యువకుడి మృతి
X

దిశ, మల్యాల: ఇరు వర్గాల ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రాజారాం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుర్రం ప్రవీణ్, వెంకటేష్ అనే యువకులపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా అతడిన హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన శివరాత్రి నరేష్, భాగ్యరాజుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఘర్షణ మద్యం మత్తులో జరిగిందా.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్సై మంద చిరంజీవి తెలిపారు.

న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన మృతుడి బంధువులు

న్యాయం చేయాలంటూ మృతుడు ప్రవీణ్ బంధువులు జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాజారాం గ్రామంలో పరిస్థితిని ముందుగానే గమనించిన స్థానిక సీఐ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత బలగాలను మోహరించారు. ప్రవీణ్ పై కక్ష పెట్టుకుని ఆ ఇద్దరు యువకులు అతి కిరాతకంగా తలపై ఇనుప రాడుతో, బండలతో మోది హత మార్చారని మృతుడి బంధువులు ఆరోపించారు. అలాంటి నిందితులకు తగిన శిక్ష విధించాలని వారు ప్రధాన రహదారిపై బైఠాయించారు.

ఈ సమయంలో వారికి సర్ది చెప్పేందుకు వచ్చిన స్థానిక సీఐ, ఎస్ఐలతో ప్రవీణ్ బంధువులు వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించడం వల్ల ఎలాంటి న్యాయం జరగదని హత్య చేసిన వ్యక్తులకు కఠినమైన శిక్ష పడేలా తాము చర్యలు తీసుకుంటామని సీఐ రమణమూర్తి సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. అనంతరం ప్రధాన రహదారిపై నిలిచిన ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు.

Next Story

Most Viewed