దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ : ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

by Disha Web Desk 1 |
దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ : ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
X

దిశ, కోరుట్ల రూరల్ : సీఎం కేసీఆర్ ముందుచూపుతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా తయారైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రాజ్యమే ధ్యేయంగా కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రారంభించారని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ వంటి పథకాలతో పాటు రైతుబంధు అమలు చేసి దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి, డబ్బు రైతు చేతికి నేరుగా అందేలా చేయడంతో దళారీ వ్యవస్థను రూపుమాపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కష్టకాలంలో రైతులకు అండగా ఉండి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సదా అండగా ఉంటుందన్నారు. రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకుని మంచి దిగుబడి పొందేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ముందుచూపుతో చేపడుతోందని పేర్కొన్నారు.

వ్యవసాయం పండుగలా జరుగుతున్న రోజుల్లో కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. మరోసారి కేసీఆర్ సీఎంగా గద్దెనెక్కి హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించనున్నారని, రైతులంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చీటీ వెంకట్ రావు, ఎంపీపీ తోట నారాయణ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అన్నం అనిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దారిశెట్టి రాజేష్, పీఏసీఎస్ చైర్మన్ ఎలిశెట్టి భూంరెడ్డి, నర్సారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed