కథలాపూర్ లో అర్థరాత్రి కలప దొంగలు..

by Bhanu |

సాధారణంగా అటవీ ప్రాంతంలోని కలపను అక్రమంగా దొంగిలించుకుపోయే దుండగులు రైతుల పొలాల గట్ల వెంబడి ఉన్న టేకును సైతం వదలడం లేదు.

కథలాపూర్ లో అర్థరాత్రి కలప దొంగలు..
X

దిశ, కథలాపూర్ : సాధారణంగా అటవీ ప్రాంతంలోని కలపను అక్రమంగా దొంగిలించుకుపోయే దుండగులు రైతుల పొలాల గట్ల వెంబడి ఉన్న టేకును సైతం వదలడం లేదు. బహిరంగ మార్కెట్ లో టేకు కర్రకు అత్యధికంగా రేటు ఉండడంతో చివరకు కలపని దొంగలించడానికి కూడా వెనకాడడం లేదు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి నలుగురు రైతులకు చెందిన పంట పొలాల్లోని టేకు చెట్లను దుండగులు నరికి వేశారు.

అత్యంత విలువైన టేకు కలపను రాత్రికి రాత్రి పుష్ప సినిమాను మరిపించేలా అక్రమంగా తరలించిపోయారు. గ్రామానికి చెందిన తీగల వెంకట్రావు, కాల్వ రాజేశం, కనకట్ల ప్రసాద్, తీగల సత్య రావు కు చెందిన పంట పొలాల్లోని సుమారు నాలుగు లక్షల రూపాయల విలువ గల 11 టేకు చెట్లను నరికి కలపను ఎత్తుకుపోయారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే టేకు చెట్లను నరికి ఎవరి కంట పడకుండా తరలించకపోవడం స్థానికంగా కలకలం రేపింది.

జనవాసాలకు దగ్గర్లోనే ఉన్న పంట పొలాలలో గొడ్డల్ల తో చెట్లను నరికి ట్రాక్టర్ల ద్వారా తరలించకపోయిన ఆనవాళ్లు ఉండగా కలప స్మగ్లర్ల ఎవరికీ చిక్కకుండా వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తుంది. మరుసటి రోజు ఉదయం టేకు చెట్లు నరికిన విషయాన్ని తెలుసుకున్న రైతులు మంగళవారం కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. సాధారణంగా పంట పొలాల దగ్గర నుండి మోటార్లు ఇతరత్రా పరికరాలు మాత్రమే ఇంతకాలం దొంగలు ఎత్తుకెళ్తుండగా వ్యవసాయ క్షేత్రాల వద్ద టేకు కలప చెట్లను నరికి తరలించడం స్థానికంగా చర్చనీయాశంగా మారింది.




Next Story