రేపు ఓపెన్ చేయనున్న స్ట్రాంగ్ రూం

by Disha Web Desk 1 |
రేపు ఓపెన్ చేయనున్న స్ట్రాంగ్ రూం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై 441 స్వల్ప ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. అయితే, కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ లక్ష్మణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను కోర్టు ముందు ఉంచాల్సిందిగా జిల్లా కలెక్టర్ తో పాటు ఈఆర్వోగా వ్యవహరించిన భిక్షపతిని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన అధికారులు స్ట్రాంగ్ రూం తాళాలు ఓపెన్ కాకపోవడంతో వెనుతిరిగారు.

స్ట్రాంగ్ రూం తాళాలు మిస్ అయిన ఘటనపై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈసీఐ ఆధ్వర్యంలో విచారణ కూడా నిర్వహించారు. కీస్ పోయిన ఘటనపై విచారణ జరిపిన హైకోర్టు నేడు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నూకపల్లి శివారులో ఉన్న డాక్టర్ వీ.ఆర్.కే ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచిన స్ట్రాంగ్ రూం తాళాలను అన్ని పార్టీల అభ్యర్థుల సమక్షంలో పగలగొట్టి సంబంధిత పత్రాలను సమర్పించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ధర్మపురి ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థులకు నేడు వీ.ఆర్.కే ఇంజనీరింగ్ కళాశాలలో హాజరు కావలసిందిగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.

స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే...

స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో 258 ఈవీఎంలలో గల సమాచారాన్ని కోర్టుకు పంపించనున్నారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో కీలకమైన 17Aతో పాటు 17C పత్రాలను జిరాక్స్ తీసి అటెస్ట్ చేసిన ఆ కాపీలను హైకోర్టుకు సమర్పించనున్నట్లుగా తెలుస్తుంది. వాటితో పాటుగా ఎన్నికలు నిర్వహించిన సరళని సీసీ ఫుటేజ్ కాపీలను కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed