హుజూరాబాద్‌లో ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను నిలిపివేయండి

by Ratna Kumari |

హుజూరాబాద్ మండలంలోని సిర్పల్లి - కొత్తపల్లి గ్రామాల సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వ్యతిరేక అఖిల పక్ష కమిటీ' సోమవారం కరీంనగర్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.

హుజూరాబాద్‌లో ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను నిలిపివేయండి
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలంలోని సిర్పల్లి - కొత్తపల్లి గ్రామాల సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ వ్యతిరేక అఖిల పక్ష కమిటీ' సోమవారం కరీంనగర్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కమిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

విత్తనోత్పత్తికి గండం..

తెలంగాణలోనే 'సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన హుజూరాబాద్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి అనేక రాష్ట్రాలకు వరి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని నాయకులు గుర్తు చేశారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల విత్తనోత్పత్తి దెబ్బతిని రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీరు కలుషితం కావడమే కాకుండా, సమీపంలోని గుట్టల్లో నివసించే వందలాది నెమళ్లు, వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఉవ్వెత్తున ఎగిసిన నిరసన..

గత 15 రోజులుగా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేలాది మంది ప్రజలు నిరసన దీక్షలు చేపడుతున్నారని కమిటీ గుర్తు చేసింది. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తో పాటు మండలంలోని 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినట్లు కమిటీ వెల్లడించింది. ​"ప్రజల ఆరోగ్యాన్ని, పచ్చని పంట పొలాలను బలిపెట్టి చేసే ఇటువంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోము. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం." అని అఖిలపక్ష నాయకులు పి. ఈశ్వర్ రెడ్డి, పోల్సాని రామ్మోహన్ రావు వెల్లడించారు. ​ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో అఖిల పక్ష నాయకులు వేల్పుల రత్నం, వెంకట్రావు, కొలిపాక సమ్మయ్య పాల్గొన్నారు.

Next Story