చిరకాల వాంఛ నెరవేరేది ఎన్నడు..? మండల కథ కంచికేనా..?

by Dishanational1 |
చిరకాల వాంఛ నెరవేరేది ఎన్నడు..? మండల కథ కంచికేనా..?
X

దిశ, రామడుగు: ఒక గ్రామం మండలంగా ఏర్పడాలంటే దానికి కావాల్సిన అర్హతలు తప్పకుండా ఉండాల్సిందే... కానీ ఇక్కడ మాత్రం అన్ని అర్హతలు ఉన్నా గ్రామం మండలం కావాలన్న కల అందని ఫలంగా మిగిలిపోయింది. నేతల మాటలు హామీలకే పరిమితమయ్యాయని విమర్శలు గుప్పుమంటున్నాయి. రామడుగు మండలంలోని గోపాల్ రావుపేట గ్రామం మండలంగా ఏర్పడాలని నాలుగు దశాబ్దాల నుండి స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ గ్రామం దినదిన అభివృద్ధి చెంది నేడు దాదాపు 30 నుండి 40 గ్రామాలకు ప్రధాన కూడలీగా అభివృద్ధి చెందింది. చెప్పుకోవడానికి గ్రామమే కానీ మండలానికి ఉండవలసిన అర్హతలు అన్ని ఈ గ్రామానికి ఉన్నాయని చెప్పుకోవడంలో సందేహం లేదు. విద్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్ అడ్రస్ గా గోపాలరావుపేట గ్రామం ముందంజలో ఉన్నది.


నాటి నుండే మండల ఏర్పాటుకు ప్రజల మద్దతు

మండల ఏర్పాటు కొరకు 1983లోనే గ్రామస్తులందరూ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకుని మండలం ఏర్పాటు చేయాలని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి మహేంద్రనాథ్ వద్దకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి కాలం నుండి నేటి వరకు గ్రామస్తులు, కుల సంఘాల పెద్దలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక గ్రామ ప్రజలందరూ ఏకమై స్థానిక ఎమ్మెల్యే వద్దకు, ప్రణాళిక సంఘం అధ్యక్షులైన బోయినపల్లి వినోద్ కుమార్ వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఇంతగా శ్రమిస్తున్న గ్రామస్తుల చిరకాల వాంఛ వినతి పత్రాలకే పరిమితమయ్యాయని మరి ఇది అధికార యంత్రాగం తప్పిదమా అన్నట్లుగా విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఎవరికి లాభం....? ఎవరికి నష్టం...?

అసలు గ్రామం ఇంతటి అభివృద్ధి చెంది మండలంగా ఏర్పడితే స్థానికంగా ఉన్న రిజర్వేషన్లు మారుతాయని వాదన ముందుకు రావడంతో స్థానికంగా ఉన్న నేతలకు తలలు పట్టుకునేంత పనైంది. అటు ప్రజల ఒత్తిడి, ఇటు రాజకీయ జీవితంపై ప్రభావం పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏళ్ల నాటి గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరాల్సిన బాధ్యత స్థానిక నేతలపై ఎంతైనా ఉంది.

Next Story

Most Viewed