ఛీ... ఈ సర్పంచ్ గిరి చేయడం కంటే రాజీనామా చేయడం మేలు

by Dishanational1 |
ఛీ... ఈ సర్పంచ్ గిరి చేయడం కంటే రాజీనామా చేయడం మేలు
X

దిశ, వెల్గటూర్: రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల డిజిటల్ కీలు దొంగిలించి 15 ఫైనాన్స్ అకౌంట్లోని డబ్బులను సీసీ చార్జీలకు చెల్లించడాన్ని సర్పంచులంతా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. డిజిటల్ కీలు దొంగిలించి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశారని, ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల డిజిటల్ కీలు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి.. అభివృద్ధి పనుల చెక్కులు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. వెల్గటూరు మండల పరిషత్ కార్యాలయానికి బుధవారం మధ్యాహ్న సమయంలో సర్పంచులంతా మూకుమ్మడిగా ఎంపీడీవో ఆఫీస్ కి విచ్చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ డిజిటల్ కీలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి 15 ఫైనాన్స్ అకౌంట్ లోని డబ్బులను మాయం ఏంటని మండిపడ్డారు.

సర్పంచులందరూ మండల పరిషత్ సమావేశ మందిరంలో కూర్చొని 15 ఫైనాన్స్ లోని డబ్బులను సీసీ చార్జెస్ కు మళ్ళించడంపై చర్చించారు. తమకు తెలియకుండా డిజిటల్ కీలను ఎలా ఉపయోగిస్తారని ఎంపీడీవోని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేసిన వాటికి బిల్లులు రాక సర్పంచులు 8 నెలలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పుల కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందారు. సర్పంచులు అప్పలపాలైనా, నష్టపోయినా ప్రభుత్వానికి పర్వాలేదా అని మండిపడ్డారు. మీ సీసీ చార్జెస్ గురించి మీరు ఆలోచిస్తే, మా గురించి పట్టించుకునేది ఎవరని నిరసన వ్యక్తం చేశారు. పలువురు సర్పంచులు చేసిన పనులకు రూ.20 నుంచి 30 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చెక్కులు వేసి అకౌంట్లో నాలుగు నెలలు గడుస్తుందని ఆవేదన చెందారు.

ఓ దశలో ఈ ప్రభుత్వంలో సర్పంచ్ పదవి చేసే దానికంటే రాజీనామా చేయడమే ఉత్తమం అని అనటం విశేషం. ప్రభుత్వం తీరు చూస్తుంటే మా బిల్లులు చెల్లించడం పట్ల పట్టింపు బాధ్యత లేదని అర్థమవుతుందన్నారు. చాలా నెలల తరువాత అకౌంట్లో జమైనా డబ్బులను ఎలా సీసీ చార్జెస్ కు చెల్లిస్తారని ప్రశ్నించారు. పైనుంచి ఆదేశాలు వస్తేనే డిజిటల్ కీలను వినియోగించి సీసీ చార్జీలను చెల్లించామని ఎంపీడీవో సంజీవరావు తెలిపారు. గత నెల 23వ తేదీన ఇదే ఎంపీడీవో ఆఫీస్ ముందు పలువురు సర్పంచులు బిల్లుల కోసం ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదు.. ఇకముందు చూడ బోమన్నారు. సర్పంచుల డిజిటల్ కీ లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed