జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు :  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2025-26 సీజన్‌లో జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 436 కేంద్రాల ద్వారా 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 81,954 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, 48 నుంచి 72 గంటల్లోనే 90 శాతం మంది రైతుల ఖాతాల్లో రూ.1,075 కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత ఉన్నప్పటికీ యంత్రాంగం సమన్వయంతో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి, 47 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ధాన్యంలో కోతలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రైతులను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చినా ప్రభుత్వం విజయవంతంగా కొనుగోలు చేసి రైతులకు రూ.1,100 కోట్లకు పైగా చెల్లించిందని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు జరగకపోయినా, తెలంగాణలో మాత్రం భారీ స్థాయిలో సేకరించి రైతులకు అండగా నిలిచామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story