ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

by Ratna Kumari |

జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామసభల నిర్వహణ, వనమహోత్సవం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల విజయవంతంపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా గ్రామసభల్లో రాబోయే వర్షాకాలానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడం, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పక్కగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, వార్డు సభల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.


ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బౌండరీలు ఉన్న ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి. శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, సీపీవో రామ్ దత్త రెడ్డి, డీపీవో జగదీశ్వర్, ఇన్‌చార్జి సీఈవో పవన్ కుమార్, డీఈవో ప్రశాంత్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూపరాణి, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Next Story