పబ్లిసిటీకే పరిమితమైన ప్లాస్టిక్ నిషేధం

by Disha Web Desk 12 |
పబ్లిసిటీకే పరిమితమైన ప్లాస్టిక్ నిషేధం
X

దిశ ప్రతినిధి, జగిత్యాల : దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించినప్పటికీ జగిత్యాల పట్టణంలో మాత్రం యధేచ్ఛగా వాడేస్తున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలను బహిరంగ మార్కెట్‌లో ఎప్పటిలాగే విచ్చలవిడిగా సాగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడడం లేదు. అడపాదడపా నామ మాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డిస్పోజబుల్ ప్లాస్టిక్ వినియోగం మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది. ఎంతలా అంటే క్యారీ బ్యాగ్ నుంచి స్పూన్స్ వరకు తినే ప్లేట్స్, గ్లాసులు ఇలా అన్ని వస్తువులు ప్లాస్టిక్‌తోనే తయారు చేసే పరిస్థితి నెలకొన్నది. తక్కువ ఖర్చుతో తయారు కావడం ఈజీగా వాడి పడేసేవి కావడంతో జనాలు కూడా ప్లాస్టిక్ వాడకానికి అలవాటుపడ్డారు.

సింపుల్‌గా వాడుకోగలిగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రం దీర్ఘకాలంలో కలిగించే అనర్థాలు ఎక్కువే.! అవి భూమిలో కలిసి పోవడానికి వందల ఏళ్లు పడుతుండడంతో ఆ ప్రభావం వాతావరణంపై పడుతుంది. తేలికగా ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలను కాల్చి వేయడంతో దాని నుంచి వచ్చే విషవాయువులు మరింత కాలుష్యాన్ని కల్గిస్తున్నాయి. ఇలా అవగాహన లేకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మళ్లీ వాడటం కారణంగా కాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గతేడాది జూలైలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతేకాకుండా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిని ఆచరణలో పెట్టాల్సిన అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ ప్లాస్టిక్ వ్యాపారులతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

యధేచ్ఛగా వినియోగం..

ప్లాస్టిక్ నిషేధంపై మాటల్లో ఉన్నది చేతల్లో కనిపించడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై బ్యాన్ ఉన్నప్పటికీ జగిత్యాల పట్టణంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. మొదట్లో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అధికారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే షాపులపై ఉక్కుపాదం మోపారు. గతంలో కమిషనర్‌గా ఉన్న స్వరూపరాణి రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ వాడకాన్ని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఆ తర్వాత మళ్లీ ఒక్కసారిగా ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. ప్రతి షాప్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ విరివిగా వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మామూళ్ల మత్తులో అధికారులు..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ విక్రయించే వారితో చేతులు కలిపిన కొంతమంది అధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టణ శివారులోని కొన్ని షాపుల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ దాడులు చేయడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్‌లో కీలకంగా వ్యవహరించే కొంతమంది అధికారులకు ప్రతినెల పెద్దఎత్తున ముడుపులు పెట్టడంతోనే ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.



Next Story

Most Viewed