రైతుల దయనీయ స్థితి అధికారులకు పట్టదా : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Disha Web Desk 1 |
రైతుల దయనీయ స్థితి అధికారులకు పట్టదా : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, పెగడపల్లి : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే సమయానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని.. ఈ దయనీయ స్థితిలో రైతులు పరిస్థితి అధికారులకు కనిపించడం లేదా అంటూ డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు.

మండలంలోని ఎల్లాపూర్, రాజారాంపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని అయినప్పటికీ అధికారులు ఎవరూ కూడా కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం లేదన్నారు. రైతుల సమస్యలు మీకు పట్టవా అని ప్రశ్నించారు.

అంతే కాకుండా తేమ శాతం విషయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కొనుగోళ్ల విషయంలో ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాచకొండ రాజశేఖర్, రంగ్ మహేందర్, శేఖర్, కోట సతీష్, రంగు స్వామి, అంజయ్య రైతులు ఉన్నారు.

Next Story

Most Viewed