మొలంగూరు ఖిల్లా ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారుల పరిశీలన

by Ratna Kumari |   (  Updated:2026-03-28 14:50:57  IST  )

శంకరపట్నం మండలంలోని చారిత్రక ప్రాముఖ్యం ఉన్న మొలంగూరు ఖిల్లా ప్రాంతంలో గుప్త నిధులకై త్రవ్వకాలు జరిగినట్టు గ్రామ సర్పంచ్ తో పాటు ప్రజలు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

మొలంగూరు ఖిల్లా ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారుల పరిశీలన
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని చారిత్రక ప్రాముఖ్యం ఉన్న మొలంగూరు ఖిల్లా ప్రాంతంలో గుప్త నిధులకై త్రవ్వకాలు జరిగినట్టు గ్రామ సర్పంచ్ తో పాటు ప్రజలు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. శనివారం ఖిల్లా పరిసర ప్రాంతాలను పురావస్తు శాఖ సహాయకుడు రవితేజ కార్యాలయ సిబ్బంది ఎండి గౌస్ తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వారసత్వ కట్టడాలు జాతీయ సంపద అని వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామ యువత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఖిల్లా ప్రాంతాల్లో గుప్త నిధులు నిక్షేపాలు ఉన్నాయనేది భ్రమ మాత్రమేనని వాస్తవంగా గుప్త నిధులు అనేవి లేవని తెలిపారు. గుప్త నిధుల త్రవ్వకం పేరుతో వారసత్వ కట్టడాలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ఖిల్లా పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన తెలంగాణ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు అవశేషాల చట్టం - 1960 ప్రకారం.. శిక్షార్హులవుతారని హెచ్చరించారు. భవిష్యత్తులో గుప్త నిధులకై త్రవ్వకాలు చేపట్టకుండా ఉండేందుకై కోట ప్రాంతంలో శాశ్వత కాపలాదారుడు అవసరం అనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఎస్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ పూదరి రాజు పాల్గొన్నారు.

Next Story