నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఎవరూ మోసపోవొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

by Disha Web Desk 1 |
నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఎవరూ మోసపోవొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
X

చందుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ

దిశ, చందుర్తి : నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఎవరూ మోసపోవొద్దు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం ఆయన చందుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీం, లాక్ అప్ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. స్టేషన్లో రోజువారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం సర్కిల్, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు,అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సీడీ ఫైల్స్, పెండింగ్, ట్రాయల్స్ లో ఉన్న సీడీ ఫైళ్లు, గ్రేవ్ కేసెస్ లో ఉన్న సీడీ ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తు ప్రజాసేవకు అంకితం కావాలన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని విలేజ్ పోలీస్ అధికారి నిత్యం తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు.

క్రైం మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ మరియు సిస్టమ్ ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, సీడీఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సీడీ, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్లో ప్రతి రోజూ విధిగా ఎంటర్ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైం రేటును పూర్తిగా తగ్గించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని, కేసుల్లో శిక్షణ శాతం పెంచాలని తద్వారా నేరాలను అదుపు చేయవచ్చని అన్నారు.

బ్లూకోల్ట్స్, పాట్రోల్ కార్ నిరంతరం గ్రామాల్లో 24 గంటలు గస్తీ నిర్వహించాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు. పాత నేరస్థులఫై నిఘా పెట్టాలని, సస్పెక్ట్ ,రౌడీ షీట్స్ మీద నిరంతరం ఓ కన్నేసి ఉంచాలన్నారు. గ్రామీణ ప్రజలకు పోలీస్ మీ కోసం కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలు, నకిలీ గల్ఫ్ ఏజెంట్లు, షీ టీం, డయల్ 100 సీసీ కెమెరాల ఉపయోగం తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నరు.

పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ఎంఎస్ గ్రీవెన్స్ సెల్ ద్వారా పంపించాలని హెచ్ఆర్ఎంఎస్ లో ఉన్న అన్ని మాడ్యూల్స్ ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. విధి నిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీ పడి విధులు నిర్వహించాలన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు, అవార్డులు ప్రతినెలా అందజేస్తామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ కిరణ్, ఎస్.ఐ రమేష్, రమాకాంత్, ప్రభాకర్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో 8 మందికి బెయిల్



Next Story