పండగ పూట విషాదం... పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

by Disha Web Desk 4 |
పండగ పూట విషాదం... పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హోళీ పర్వదినాన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకగా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లిలో ఈతకు వెల్లి 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు.

కుటుంబ కలహాలతో...

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో శుక్రవారం తెల్లవారు జామున ఇద్దరి చిన్నారులతో సహా తల్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారులు అభిజ్ఞ (3), హన్సిక (6)మృతదేహాలు నీటిలో తేలాయి. తల్లి రేఖ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేఖ ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే రేఖ తన పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని రేఖ బంధువులు ఆరోపించారు. కొత్తపల్లికి చెందిన మర్కుటి రాజుతో మండలంలోని లింగన్నపేటకు చెందిన రేఖతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగిందని వారు వివరించారు. అయితే పెళ్లి అయినప్పటి నుండి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవని తెలిపారు. అత్తింటి వారి వేధింపుల వల్లే రేఖ పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిందని వారు ఆరోపించారు. మధ్యాహ్నం కల్లా రేఖ మృతదేహం కూడా చెరువులో తేలింది. అయితే ముగ్గురి శవాలను వెలికి తీయవద్దని రేఖ బంధువులు పట్టబట్టారు. మరోవైపు రేఖ అత్తింటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు రేఖ బంధువులను ఒప్పించి ఆమె భర్త రాజును ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. గంభీరావుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రామడుగు మండలంలో...

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలోని ఊర చెరువులో సాయి చరణ్ (14) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు. గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి ఊర చెరువులో ఈతకు వెళ్లగా సాయి చరణ్ చెరువులో మునిగిపోయాడు. ఈ సమాచారం అందుకున్న బంధువులు చెరువులో సాయి చరణ్ కోసం గాలించగా శుక్రవారం ఉదయం శవమై తేలాడు. రామడుగు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed