ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే సత్తా మోదీకే ఉంది : బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్

by Disha Web Desk 1 |
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే సత్తా మోదీకే ఉంది : బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్
X

దిశ, పెద్దపల్లి : సమర్థ పాలన, పటిష్ట నాయకత్వం వల్లే భారతదేశం అభివృద్ధిలో పురోగమిస్తోందని, సబ్ కాసాత్.. సబ్ కా వికాస్ స్పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలనిస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ప్రభారి అరవింద్ మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించేందుకు గానూ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు జిల్లా కేంద్రంలోని అకేషన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. 2014కు ముందు దేశంలో స్కాముల ప్రభుత్వం అవినీతి పాలన చేసిందన్నారు.

అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే సత్తా కేవలం నరేద్ర మోదీకే ఉందనే విషయాన్ని వివిధ దేశాలకు చెందిన ప్రధానులు పేర్కొనడం మోదీ ఘనతగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యవంతులను చేస్తామన్నారు.

ఉల్టా పల్టా అలయన్స్..

యూపీయే అంటేనే ఉల్టా పల్టా అలయన్స్ అంటూ ఆయల ఛలోక్తులు విసిరారు. ఆ హయాంలో జరిగిన స్కాముల గురించి వివరించారు. ప్రపంచ వేదికలపై రాహుల్ గాంధీ చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలను ఆయన ఖండించారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లలో భారత్ అగ్రస్థానంలో ఉందన్న ఆయన డిజిటల్ కరెన్సీ ప్రస్థావన వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించందని తెలిపారు.

అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం..

రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు తగిన గుణపాఠం చెపుతామన్న అరవింద్, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి వస్తున్నాని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు చాలావేగంగా బీఆర్ఎస్ దూరం అవుతోందన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. డ్రగ్ మాఫియా రాష్ట్రాన్ని ఏళుతోందని, యువత చెడుమార్గంలో నడుస్తోందన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీ, పోలీసు పోస్టుల భర్తీ చేయడంలో అలసత్వం, సైబర్ క్రైంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంట నష్టపోయిన రైతులకు రూ.10వేలు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అమలు చేయడం తప్పా.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. భౌతిక దాడులకు పాల్పడటం బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలకు నిదర్శనమి ఆక్షేపించారు. అంతకు ముందు ఒరిస్సా రైలు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన వారి ఆత్మ శాంతించాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ప్రమాదంపై వేగంగా దర్యాప్తు సాగుతోందని, ప్రమాదానికి అసలు కారణాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, జిల్ల అధ్యక్షుడు రావుల రాజేందర్, జిల్లా ఇన్ చార్జి రావుల రామ్ నాథ్, పార్లమెంట్ ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, బెజ్జంకి దిలిప్, తంగెడ రాజేశ్వర్ రావు, దాడి సంతోష్, రాజం మహంత, భీమారపు సంపత్, ఎర్రోళ్ల శ్రీకాంత్, పోల్సాని సంపత్ రావు, శిలారపు మధు, ముంజ రాజేందర్, వేణు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Next Story