రాష్ట్ర ప్రభుత్వాన్ని సాదుతున్నది వీళ్లే... అయినా వీళ్లను ఎందుకు ఆదుకోవట్లే..?

by Dishanational1 |
రాష్ట్ర ప్రభుత్వాన్ని సాదుతున్నది వీళ్లే... అయినా వీళ్లను ఎందుకు ఆదుకోవట్లే..?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గల్ఫ్ లో మృతిచెందిన కుటుంబాల కోసం రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్లి అక్కడే మృతిచెందిన వెంకటేశ్ కుటుంబాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. అనంతరం గంభీర్ పూర్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఏటా విదేశీ మారక ద్రవ్యం రూపంలో 18000 కోట్ల రూపాయలు వస్తున్నాయని, ఎనిమిదేండ్ల కాలంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో తెలంగాణ రాష్ట్రానికి 14,400 కోట్లు సమకురయాని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాదుతుంది గల్ఫ్ కార్మికులే అని.. కానీ వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేస్తున్నది శూన్యం అని విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే స్థానికంగా ఉపాధి కరువై గల్ఫ్ బాట పడుతున్నారన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక వలసలు రెట్టింపు అయ్యాయని.. తెలంగాణ నుండి గల్ఫ్ దేశాల్లో సుమారు 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశామని గుర్తుచేశారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక గల్ఫ్ లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 500000 ఇస్తామని ప్రకటన చేశారు తప్ప ఇప్పటివరకు ఒక్క కుటుంబానికి ఆర్థిక సాయం అందించలేదని, గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ నుండి 2000 శివపేటికలు వచ్చాయని, ఇప్పటికైనా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ. 100 కోట్ల నిధులు కేటాయించాలని, వారి పిల్లలకు గురుకులాల్లో ఐదు శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

విదేశీ మారకద్రవ్యం రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. వేల కోట్లలో ఆదాయం వస్తున్నా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని.. వారి సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న గల్ఫ్ జేఏసీ నాయకులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గల్ఫ్ లో కార్మికులు చనిపోతే వారి శవాన్ని తీసుకురావడంతోపాటు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న గల్ఫ్ జేఏసీ పై వేములవాడ ఎమ్మెల్యే ఇంటి ముందు శవపేటిక పెట్టి నిరసన తెలిపినందుకు కేసులు పెడతారా? అంటే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎవరు మాట్లాడ వద్ధా అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చేత రూ. 5 లక్షల సాయం ఇప్పించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించకపోతే గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రత్యక్ష పోరాటం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story

Most Viewed