విద్య, నైపుణ్య అభివృద్ధితో ఉపాధి అవకాశాలు: మంత్రి లక్ష్మణ్ కుమార్

by Kodari Anjali |

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇవాళ చండీగఢ్‌ చింతన్ శివిర్‌లో పాల్గొన్నారు.

విద్య, నైపుణ్య అభివృద్ధితో ఉపాధి అవకాశాలు: మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, ధర్మపురి: విద్య నైపుణ్య అభివృద్ధితో బలహీన వర్గాల ఉపాధి అవకాశాలు విస్తరణ చేయడం వల్ల వారి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవు తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "చింతన్ శివిర్" సదస్సు ఆదివారం హర్యానా రాష్ట్రం లోని చండీగఢ్‌లో జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు, బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి వంటి కీలక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. తెలంగాణతో పాటు ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, మేఘాలయ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఉపసంచాలకులు చింతనతో శివిర్‌లో పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ పలు సూచనలు చేశారు.

సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత..

సామాజిక న్యాయ రంగంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. విద్య, నైపుణ్యాభి వృద్ధి పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాల విస్తరించి బలహీన వర్గాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వాలు కృషి చేయాలని అభిప్రాయ పడ్డారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగవంతం కోసం డిజిటల్ విధానాలను విస్తృతంగా వినియోగించాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వినూత్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ చింతన్ శివిర్ ద్వారా రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాలను అమలుకు అలాగే కార్యాచరణలో సమన్వయం సాధించేందుకు ప్రయోజన కరమైన వేదికగా నిలిచిందని మంత్రి అడ్లూరి అభిప్రాయ పడ్డారు.

Next Story