జనవరి 18 నుండి కంటి వెలుగు రెండో దఫా: Minister Harish Rao

by Dishanational1 |
జనవరి 18 నుండి కంటి వెలుగు రెండో దఫా: Minister Harish Rao
X

దిశ, కరీంనగర్ టౌన్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే నెల జనవరి 18 నుండి రెండో దఫా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ప్రభుత్వం వైద్యశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుండి వైద్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీతో జగిత్యాల కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదులందరూ ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం కూడదని, సీరియస్ గా తీసుకొని పని చేయాలన్నారు.

జిల్లాల్లో సమర్థవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే సిబ్బందిని ఎక్కువగా పెంచిందన్నారు. మొదటిసారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. సీఎం ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారని, ప్రజల కోణంలో ఆలోచిస్తారని చెప్పారు. ప్రభుత్వపరంగా అన్ని చేస్తామని, అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిందని, రోజువారీ వైద్యసేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్ లలో కంటి వెలుగు పై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు.

జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలని, ఏ రోజు ఎక్కడా క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ (అడ్వాన్స్ టీమ్)లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు చేసుకోవడం మిస్ అయినవారి కోసం మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నామన్నరు. ఎలాంటి వైద్య సిబ్బంది కొరత లేదన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుందని, కానీ ఎఫెక్టివ్ గా జరిగేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదనే లక్ష్యంతో సీఎం ఉన్నారని, నెరవేరడంలో మనందరిది ముఖ్య పాత్ర అన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామన్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేస్తున్న సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీల కొత్త నిర్మాణాలు, మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలకు కంటిపరీక్షలు నిర్వహించేందుకు సూక్ష్మప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆశా, ఏఎన్ఎం, ఎస్ హెచ్ జీ, మెప్మా సిబ్బందిని 48 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ఆప్తమాలాజీ అసిస్టెంట్లను నియమించామని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ, గ్రామపంచాయతీ వార్డుల వారీగా జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, వైద్య అధికారుల సమన్వయంతో సూక్ష్మ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేసేందుకు పగడ్బందీ శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జువేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, చొప్పదండి హుజురాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed