ప్రకృతి ప్రకోపించినా కేసీఆర్ ఆదుకుంటారు : మంత్రి గంగుల

by Disha Web Desk 20 |
ప్రకృతి ప్రకోపించినా కేసీఆర్ ఆదుకుంటారు : మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ టౌన్ : జిల్లాలో శనివారం కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాలతో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పంట నష్టపోయిన కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ స్థానిక యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, రైతులలో పూర్తి భరోసా నింపారు. కాలిగాయంతో మూడువారాలు పూర్తి రెస్టులో ఉండాలని డాక్టర్లు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో అకాల వర్షాలతో, ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చానని తెలిపారు. ఏ రైతు అధైర్యపడొద్దని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ నష్టపోయిన పంటకు ఖచ్చితమైన పరిహారం అందజేస్తామన్నారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణ మండలంలోని చామన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ఆరు గ్రామాల్లో 5వేల ఎకరాల్లో పంటలు కనీసం కిలో కూడా చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ గ్రామాల్లోనే దాదాపు 3144 ఎకరాలు నష్టపోయాయని ప్రాథమిక అంచనాలను అధికార యంత్రాంగం వేసిందన్నారు. స్థానికంగా తనకున్న మూడెకరాలతో పాటు మరో 25ఎకరాలు కౌలు చేసిన స్థానిక రైతు లక్ష్మయ్యకు గింజ ధాన్యం కూడా దక్కని పరిస్థితికి ఆవేదన చెందిన గంగుల పూర్తిగా అండగా ఉంటామని ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని భరోసా నింపారు.

చేతికొచ్చిన పంట భూమి పాలవడంతో రైతు కల్లలో కన్నీళ్లు తప్ప ఏం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. మొన్నటికి మొన్న అకాలవర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి పర్యటించారని, ఎక్కువగా నష్టం జరిగిన హార్టికల్చర్ పంటపోలాల్లో స్వయంగా తిరిగి ఎకరాకు పదివేల నష్టపరిహారాన్ని సైతం అందించామన్నారు. మొదటి విడతలో 20 నుండి 30 శాతం నష్టం జరిగినా మళ్లీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట చేతికొస్తుందనే దశలో మరోసారి ఇలా పంట నష్టానికి గురవడం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందన్నారు.

మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబందించిన ఎనిమిదన్నర కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే వాటిని రైతులకు అందజేయడంతో పాటు ప్రస్థుత నష్టాన్ని పూర్తిస్థాయిలో రెండు మూడురోజుల్లోనే అంచనా వేసి ఆదుకుంటామన్నారు. నేడు సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి నష్టం అంచనాకు యుద్దప్రాతిపదికన యంత్రాంగాన్ని సమాయత్తం చేసామన్నారు. సాదారణంగా యాసంగిలో ఎప్రిల్ 20 తర్వాత పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తారని, కానీ ఇలాంటి పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం 10వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొంత పంటను కాపాడగలిగామన్నారు.

కేసీఆర్ రైతుల్లో భరోసా నింపేలా నీళ్లు, ఉచితకరెంటు, మౌళిక వసతులు, రైతుబందు, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో తెలంగాణ రైతులో భరోసా పెరిగిందని అన్నారు. గతం కన్నా ఎన్నో రెట్లు అధికంగా పంటను పండిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రైతు, ప్రభుత్వం నిలిచిందన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని సివిల్ సప్లైస్ శాఖను అదేశించామన్నారు. వాటిని అవసరమైతే బాయిల్డ్ రైస్ చేయాలని ఆదేశించారు. ప్రక్రుతి వైపరీత్యాన్ని మానవమాత్రులం ఎం చేయలేకపోయినా... నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకు అండగా ఉంటామన్నారు. ప్రక్రుతి సహకరించకపోయినా కేసీఆర్ సహకరిస్తారని ఎవరూ అధైర్య పడొద్దని, నిరాశపడకూడదని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంటామని మంత్రి గంగుల కమలాకర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రివెంట అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల ఉన్నారు.



Next Story

Most Viewed