ప్రభుత్వానికి.. పార్టీకి కార్యకర్తలు వారధిగా పనిచేయాలి : మంత్రి గంగుల

by Disha Web Desk 20 |
ప్రభుత్వానికి.. పార్టీకి కార్యకర్తలు వారధిగా పనిచేయాలి : మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను.. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్తూ ప్రభుత్వానికి - పార్టీకి కార్యకర్తలు వారధిగా పనిచేయాలనీ బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజాశ్రీ గార్డెన్ లో భారత రాష్ట్ర సమితి కరీంనగర్ నగర పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షతకు గురైందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని సాధించకపోతే మన భవిష్యత్తు ఎలా ఉండేదో.. ఊహించుకోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సమైక్యవాద పార్టీలకు స్థానం లేదని తెలంగాణ వనరులను దోచుకెళ్లేందుకు మరోసారి కుట్ర జరుగుతుందని... పాదయాత్రల పేరుతో కొన్ని విషసర్పాలు తెలంగాణ పై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ప్రతి కార్యకర్త అండగా నిలవాలని అన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లో ఉందని ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా అని మూడోసారి ప్రభుత్వ అధికారంలోకి వస్తుందని అన్నారు.

అభివృద్ధిలో అగ్రగామిగా కరీంనగర్...

సమైక్య రాష్ట్రంలో గత ప్రభుత్వాలకు కరీంనగర్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మనసు రాలేదని. నిధులు లేక కరీంనగర్ అభివృద్ధి కుంటుపడిందని.. నగరంలో ఎక్కడ చూసిన గుంతల రోడ్లు, రోడ్ల మధ్యలో స్తంభాలు. ప్రజలంతా దుమ్ముదుళితో అవస్థలు పడేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని. ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని. కరీంనగర్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుపడ్డాయని. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని.. చెరువులు కుంటలు మత్తడి దునుకుతున్నాయని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయి అని అన్నారు.

కరీంనగర్ ను పర్యాటక రంగంగా తీర్చిదిద్దేకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫంట్ తీగలవంతెన నిర్మాణాలతో కరీంనగర్ కు పర్యాటక శోభ సంతరించుకుందని అన్నారు. తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయని జూన్ 17న ప్రారంభోత్సవం చేసుకుంటామని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశపనులు ఆగస్టు 15 వరకు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు.. డిప్యూటీ మేయర్ చల్లస్వరూప రాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, పలువురు కార్పొరేటర్లు, 58 డివిజన్ అధ్యక్షుడు కొత్త అనిల్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Next Story