భవనంపై నుంచి కింద పడి తాపీ మేస్త్రీ దుర్మరణం

by velandi.Saikiran |

భవనంపై నుంచి కిందపడి తాపీ మేస్త్రీ మృతి చెందిన ఘటన గడ్డివానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

భవనంపై నుంచి కింద పడి తాపీ మేస్త్రీ దుర్మరణం
X

దిశ, జమ్మికుంట: మద్యం మత్తులో భవనంపై నుంచి కిందపడి తాపీ మేస్త్రీ మృతి చెందిన ఘటన గడ్డివానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మార్కాపురం జిల్లాకు చెందిన వంకాయలపాటి బెంజిమిన్, గడ్డివానిపల్లి గ్రామంలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. రాత్రి బెంజిమిన్ మరియు అతనితో కలిసి పనిచేస్తున్న మరో తాపీ మేస్త్రీ గుంటూరి రాజమోహన్ ఇద్దరూ పనిచేస్తున్న భవనం పైభాగంలో మద్యం సేవించారు. ఆ సమయంలో బెంజిమిన్ భవనంపై నుంచి మూత్రవిసర్జన చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.

తీవ్రంగా గాయపడ్డ అతడిని తెల్లవారుజామున చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని జమ్మికుంట పోలీసులకు మృతుడి తండ్రి వంకాయలపాటి చిన్న మోష ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

Next Story