ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే లవ్ జిహాద్, మత మార్పిడులు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

by Disha Web Desk 1 |
ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే లవ్ జిహాద్, మత మార్పిడులు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
X

దిశ, హుజూరాబాద్ : ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే లవ్ జిహాద్, మత మార్పిడులు పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర పోస్టర్లను ఆయన మండలంలోని కండుగులలో శుక్రవారం ఆవిష్కరించి కర పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యత, సంఘటిత శక్తిని దెబ్బతీయడానికి అనేక శక్తులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇతర మతాల మెప్పు పొందడం కోసం హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హిందూగాళ్లు.. బొందుగాళ్లు అని గతంలో చేసిన కామెంట్లను తెలంగాణ హిందూ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు.

హిందూ పండుగలకు అనేక ఆంక్షలు, నిబంధనలు విధిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతాల పండగలకు ఎంతో స్వేచ్ఛనిస్తుందని విమర్శించారు.లవ్ జిహాద్, మత మార్పిడిల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుండటంతో హిందూ సమాజానికి తీవ్ర ప్రమాదంగా పొంచి ఉందన్నారు. హిందువులంతా సంఘటితమై కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ వైశ్య భవన్ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే హిందూ ఏక్తా యాత్ర కు ముఖ్య అతిథులుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ, తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ హాజరవుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల, పట్టణాధ్యక్షులు రాముల కుమార్, గంగిశెట్టి రాజు, నాయకులు కేసిరెడ్డి విజేందర్ రెడ్డి, మహమ్మద్ నూరుల్లా, శ్రీనివాసరెడ్డి, ఎల్లా గౌడ్, స్వాతి రెడ్డి, ముప్పు మహేష్, తిప్ప బత్తిని రాజు, చంద్రగిరి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: రామదండులా కదిలి రండి.. యువతకు బండి సంజయ్ కీలక పిలుపు


Next Story

Most Viewed