హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెడితే ఖబర్దార్

by Ratna Kumari |

హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు.

హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెడితే ఖబర్దార్
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రభుత్వ నిర్ణయాలపై నిప్పులు చెరిగారు. అనంతరం ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గపు ఆలోచనలతో ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల లక్షల మంది ప్రజల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రభుత్వం ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు.. ఖబర్దార్!" అని ఆయన హెచ్చరించారు.

​డంపింగ్ యార్డుల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితుల పక్షాన తానే సుప్రీంకోర్టులో కేసు వేశానని గుర్తు చేశారు. చెత్త నుంచి కరెంట్ తీస్తామనే మాటలు నమ్మశక్యం కావని, దీనివల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై తాగునీరు విషతుల్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ ప్లాంట్లను సరిగ్గా నిర్వహించరని, ఫలితంగా పురుగులు చేరి, ప్రజలకు చర్మ వ్యాధులు (దద్దుర్లు) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

​ప్రజల ఆదేశిస్తే ముందుండి పోరాడుతా

ఎక్కడి చెత్తను ఇక్కడికి తీసుకురావడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలు గనుక ఆదేశిస్తే, డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాకుండా తాను ముందుండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వినాశకర నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఈటల స్పష్టం చేశారు.

Next Story