కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Disha Web Desk 1 |
కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, పెగడపల్లి : రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించి రైతులకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ రైతులకు ఏం చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడటంపై ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం పూర్తి కాలేదన్నారు.

తూకం విషయంలో క్వింటాలుకు ఆరు నుంచి ఎనిమిది కిలోల కోత విధిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంలో మంత్రి కొప్పుల స్పందించకపోవడం నియోజకవర్గ ప్రజల దురదృష్టమని అన్నారు. జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసినా.. ఇప్పటి వరకు ఎంత మంది మిల్లర్లకు నోటీసులు జారీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బందులు పడకుండా హమాలీ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించి చెల్లించందని గుర్తు చేశారు. తూకం నుంచి మొదలు బస్తాలు మిల్లర్లకు చేర్చే వరకు రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అవేమీ పట్టనట్లుగా ఆత్మీయ సమ్మేళనాల్లో సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరించకపోతే మండల రైతులతో కలిసి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, నంచర్ల సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ కడారి సుప్రియ తిరుపతి, పూసల శోభ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్లు తోట మల్లేశం, మద్దెల సుధీర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు సంధి మల్లారెడ్డి, తడగొండ రాజు, చాట్ల విజయ్ భాస్కర్, గర్వంద రమేష్ గౌడ్, రామిడి శేఖర్ రెడ్డి, బత్తిని చంద్రశేఖర్, పాపిరెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed