నైపుణ్య శిక్ష‌ణ ద్వారా యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగ‌వ‌కాశాలు

by Ratna Kumari |

రాష్ట్రంలో యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సాంఘిక‌ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నైపుణ్య శిక్ష‌ణ ద్వారా యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగ‌వ‌కాశాలు
X

దిశ‌, ధ‌ర్మ‌పురి : రాష్ట్రంలో యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి లో మంగళవారం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

గత పాలకులు పుష్కరాలపై వివక్ష చూపారు

గత పాలకులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పుష్కరాలను ధర్మపురి క్షేత్రం నుంచి ప్రారంభించినప్పటికీ ధర్మపురి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మంత్రి ఆరోపించారు. గతంలో పుష్కరాల సమయంలోనే పనులు చేయడం వల్ల నాణ్యత లేకపోవడం, భక్తులు పుష్కరాలకు వస్తున్న సమయంలో పనులు చేయడంతో పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారని మంత్రి తెలిపారు. ఈసారి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ల ద్వారా శిక్షణ పొందిన యువతకు ఉపాధి లభించడంతో పాటు విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టాంకాం దార యువతీ యువకులకు విదేశీ భాష పై అవగాహన కల్పించి గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చిన సందర్భంగా మంత్రి వివేక్ కి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఏటీసీలో అగ్రిక‌ల్చ‌ర్ కోర్స్ : మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో అగ్రికల్చర్ కోర్సును నూతనంగా ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ తెలిపారు. తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున ఏటీసీల్లో అగ్రికల్చర్ కోర్స్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషకరమని అన్నారు. టామ్ కామ్ ద్వారా జగిత్యాల జిల్లా నుంచి 30 మందికి శిక్షణ ఇవ్వడానికి అభ్యర్థులను ఎంపిక చేయాలని మంత్రి వివేక్ క‌లెక్ట‌ర్ ను ఆదేశించారు.

Next Story