అసాంఘిక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : డీఎస్పీ నాగేంద్ర‌చారి

by Ratna Kumari |

అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు.

అసాంఘిక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : డీఎస్పీ నాగేంద్ర‌చారి
X

దిశ, తంగ‌ళ్ల‌ప‌ల్లి : అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. మంగళవారం శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని సిక్ వాడలో డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు, నెంబ‌ర్ ప్లేట్లు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బోయిని శ్రీనివాస్, బల్విర్ సింగ్ చందర్ సింగ్‌లపై కేసులు నమోదు చేసి 14 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణతో పాటు వారికి భద్రతాభావం కల్పించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా.. అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. అలాగే గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరా వంటి అంశాలపై ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. అలాగే స్వీయ రక్షణ కోసం కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, ఉపేందర్ ఆర్ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story