జిల్లాలో ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకునే వారే కరువు?

by Dishanational2 |
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకునే వారే కరువు?
X

జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అడిగేవారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారీతిన ఇసుక తవ్వేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. సాధారణంగా వేసవికాలంలో నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ప్రకృతి సహజ వనరులు అక్రమంగా తరలిపోతున్నాయి. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. మరికొన్నిచోట్ల ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు రవాణాదారులతో కుమ్మక్కయి వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అడిగేవారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో ఇష్టారీతిన ఇసుక తవ్వేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. సాధారణంగా వేసవికాలంలో నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ప్రకృతి సహజ వనరులు అక్రమంగా తరలిపోతున్నాయి. రెవెన్యూ, మైనింగ్ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. మరికొన్నిచోట్ల ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు రవాణాదారులతో కుమ్మక్కయి వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ధర్మపురి చుట్టుపక్కల..

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గోదావరి చుట్టుపక్కల గ్రామాలైన దొంతాపూర్, దొనూర్, నక్కలపేట, దమ్మన్నపేట, రాజారాం, జైన తదితర గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా గోదావరి నుంచి తీసిన ఇసుకను స్థానికంగా కొన్ని రహస్య స్థావరాల్లో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అక్కడనుంచి జగిత్యాల, వెల్గటూర్, గొల్లపల్లి తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ధర్మపురి గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి రోజుకు సుమారు 150ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ట్రిప్పుకు రూ.4వేల చొప్పున రోజుకు రూ.6లక్షల బిజినెస్ జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మెట్‌పల్లిలోనూ పెద్దఎత్తున..

మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్, ఆత్మకూర్, కోరుట్ల శివారులోని నాగులపేట సైఫాన్ ప్రాంతాల నుంచి ఇసుకను పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాగుల నుంచి తీసుకుని ఇసుకను చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున డంప్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా కస్టమర్లకు రాత్రి పగలు తేడా లేకుండా సరఫరా చేస్తున్నారు. మెట్‌పల్లిలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కనుసన్నలో ఈ ఇసుక దందా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సర్పంచులతోపాటు కోరుట్లలోని కొంతమంది కౌన్సిలర్లు అక్రమ దందా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్మపురి, మెట్‌పల్లిలో పెద్దఎత్తున ఈ దందా సాగుతుండగా జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా పెద్దఎత్తున జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చూసీచూడనట్లుగా ఉంటున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్దఎత్తున ముడుపులు..

జిల్లాలోని కొంతమంది అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కై వారితో చేతులు కలిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల ఎవరి వాటాలు వారికి ముట్ట చెప్పడంతో అక్రమంగా నిల్వచేసిన డంపుల వైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు పట్టుబడినప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడే నామమాత్రంగా తనిఖీలతో సరిపెడుతుండగా మరుసటి రోజునుంచి యధావిధిగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇసుక డంపుల సీజ్

దిశ ప్రతినిధి, జగిత్యాల : మెట్‌పల్లి మండలంలోని ఆత్మనగర్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా డంపు చేసిన సుమారు 120 ట్రిప్పుల ఇసుక కుప్పలను గురువారం సీజ్ చేసినట్లు మెట్‌పల్లి తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. పట్టుకున్న ఇసుకను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని అన్నారు. అయితే మండలంలోని ఆత్మనగర్, ఆత్మకూరులో వీడీసీలు ఇసుక తోడేందుకు అనఫిషియల్‌గా టెండర్లు నిర్వహించినట్లు సమాచారం. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా పెద్దఎత్తున ఇసుకను తోడుతూ డంపు చేస్తున్నట్లు తెలియ వచ్చింది. మండలంలోని కేవలం ఒకటి రెండు గ్రామాల్లోనే ఇంత పెద్దఎత్తున ఇసుక డంప్ చేస్తే జిల్లాలోని మిగతా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed