అక్రమ పీడీఎస్ బియ్యం నిల్వ గుట్టురట్టు..

by Kodari Anjali |   (  Updated:2026-07-18 15:49:33  IST  )

నార్కోటిక్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించి భారీగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

అక్రమ పీడీఎస్ బియ్యం నిల్వ గుట్టురట్టు..
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన ముఠాపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించి భారీగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనీలో సంతోష్‌నగర్‌లో శనివారం నిర్వహించిన దాడుల్లో సుమారు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.2.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మోతె కనుకయ్య (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యంను గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం, బ్లాక్ మార్కెట్‌కు మళ్లించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు హెచ్చరించారు.

Next Story