బీజేపీ కళ్లు తెరిస్తే కొట్టుకుపోతావ్.. సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Disha Web Desk 1 |
బీజేపీ కళ్లు తెరిస్తే కొట్టుకుపోతావ్.. సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, హుజూరాబాద్: బీజేపీ కళ్లు తెరిస్తే కొట్టుకుపోతావ్.. సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ పై అక్రమ కేసులు పెట్టి పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఈటల మాట్లాడుతూ టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరీక్షలకు హాజరైన వారందరికీ పరిహారంగా రూ.లక్ష చెల్లించడంతో పాటు వెంటనే తిరిగి ఎంటెన్స్ నిర్వహించాలన్నారు.

చదువుకున్న వారికి కాకుండా కొనుకున్న వారికే కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చే దౌర్భాగ్య పరిస్థితులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కళ్లు తెరిస్తే కొట్టుపోతావని కేసీఆర్ ను హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికి మంజూరు కానీ 3,500 మందికి ఈ పథకాన్ని తక్షణమే వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులందరికీ రెండో విడత నిధులు విడుదల చేయాలన్నారు.

నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, అయన రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ ను ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్లు వేసిన వారిని, అసభ్య పదజాలంతో దూషించిన వారిని అందలమెక్కిస్తున్నాడని విమర్శించారు. నిజమైన ఉద్యమకారులు ఇపుడు బీఆర్ఎస్ లో ఎందరున్నారని ప్రశ్నించారు. విపక్షాల కూటమికి చైర్మన్ గా చేస్తే ఎన్నికల ఖర్చంతా భరిస్తానన్న కేసీఆర్ కు అంత డబ్బెక్కడిదో చెప్పాలన్నారు. శిఖండిలతో కాదు నా పోరాటం నేరుగా సీఎం తోనే అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తన టార్గెట్ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్బంగా బాణ సంచా పేల్చినా సంఘటనలు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆ పార్టీ తరపున రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారందరికీ రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానానికి అనుగుణంగా చర్యలు చేపట్టిన చెల్పూర్ సర్పంచ్ పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని మండి పడ్డారు.

పోలీస్ స్టేషన్ లో సర్పంచ్ ను కొట్టిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన మద్దతు దారులపై ప్రభుత్వం పోలీసులచే అక్రమ కేసులు మోపి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి మెప్పు కోసమో తప్పుడు కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. కక్ష పూరితంగా వ్యవహరించే వారిని భవిష్యత్తులో వదిలి పెట్టేది లేదన్నారు.

పోలీసులకు భయపడేది లేదని లక్ష మందితో లడాయి చేస్తామని ఈటల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజెపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, నాయకులు తక్కళ్లపల్లి ప్రదీప్ రావు, రావు పద్మ, ఏనుగు రాకేష్ రెడ్డి, థామస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed