హిందూ శక్తిని చాటేందుకే 14న ‘హిందూ ఏక్తా యాత్ర’ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్

by Disha Web Desk 1 |
హిందూ శక్తిని చాటేందుకే 14న ‘హిందూ ఏక్తా యాత్ర’ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
X

లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం

కుహానా లౌకికవాదులకు చెంపపెట్టుగా ఈ యాత్ర

యాత్రకు రానున్న అసోం సీఎం, 'ది కేరళ స్టోరీ' చిత్ర యూనిట్

రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నాం

దిశ, కరీంనగర్ : తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ను చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తోపాటు ‘ ది కేరళ స్టోరీ’ చిత్ర యూనిట్ సహిందూ ‘హిందూ ఏక్తా యాత్ర’ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హేళన చేస్తున్న కుహానా లౌకికవాదులకు చెంపపెట్టుగా యాత్ర నిర్వహించబోతున్నామని తెలిపారు.

హిందువులంతా స్వచ్ఛందంగా హాజరై సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం నాయకులు బెదిరింపులకు తలొగ్గి ఎస్ఐని సస్పెండ్ చేసి కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యగానే అభివర్ణించారు.

ఈ రోజు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈనెల 14న జరగబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, కుహానా లౌకికవాదుల పేరుతో కొన్ని పార్టీల నాయకులు హిందువులను హేళన చేస్తూ చులకన భావనతో చూస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని హిందువులందరినీ సంఘటిత శక్తిగా చేసేందుకు ఈనెల 14న కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.

కర్నాటకలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. తెలంగాణలో పోటీ పడి కొన్ని పార్టీలు హిందువులను హేళన చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే హిందూ ధర్మ రక్షణ గురించి ఆలోచించే యువకులు, ప్రజలంతా కరీంనగర్ లోని వైశ్య భవన్ నుంచి నిర్వహించే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. హిందువులను కించపరిచే వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేలా సత్తా చాటుదామన్నారు. నిన్న జగిత్యాలలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.

ఎస్ఐ అనిల్ కుమార్ భార్య, ఇద్దరు పసి పిల్లలతో కలిసి బస్పు ఎక్కితే చిన్న కొడుకుకు పాలు ఇవ్వడానికి సీటు అడిగితే.. పక్కనే బుర్ఖా వేసుకున్న మహిళ సీటు ఇవ్వకుండా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ గొడవ పెట్టుకోవడం మానవత్వానికి మచ్చని అన్నారు. అంతే కాకుండా వాళ్ల మనుషులకు ఫోన్ చేసి పిలిపించి.. అక్కడి ఎస్సై అనిల్ వచ్చేలా చేసి.. అతను గొడవ సద్దుమణిగేలా చేస్తే కావాలని రెచ్చగొట్టి గొడవ చేసి తనపైనే దాడి చేశారని పేర్కొంటూ ఫిర్యాదు చేయడం బాధాకమని అన్నారు.

ఎస్ఐ దాడి చేసిన దాఖలాల్లేవు. కనీసం విచారణ చేయకుండానే అమాయకుడైన ఎస్ఐ అనిల్ కుమార్ ను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జగిత్యాల సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందన్నారు. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ వాగుతున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. రేపటి నుంచి తాము కూడా జగిత్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని.. వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు.

నిన్న జరిగిన ఘటనకు నిరసనగా రేపు జగిత్యాల బంద్ కు బీజేపీ పిలుపునిస్తోందన్నారు. ప్రజలంతా అందరూ సహకరించాలని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కొద్దిసేపటి క్రితమే.. నర్సంపేటకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉరేసుకోవడం తనను కలచి వేసిందన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాల్లో చేరితే.. వారితో నాలుగేళ్లు చాకిరీ చేయించుకుని రెగ్యులరైజ్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. వాళ్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చూపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు.

గత 15 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందన్నారు. దీంతో ఇక తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలనే ఆందోళనతో సోనీ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చపోవడం వల్లే సోనీ ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆరోపించారు. ‌జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరూ ఆత్మహత్యకు పాల్పడొద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మీరు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న ఉద్యోగాలు ఎక్కడికి పోవని.. అందరి తరపున కొట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఇంకా ఐదు నెలలేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు అన్ని బెన్ ఫిట్స్ ఇచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ మార్పు కోసమే మేం చేస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed