ఆరోగ్యమే మహాభాగ్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

by Dishanational1 |
ఆరోగ్యమే మహాభాగ్యం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీసులు సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి తెలియజేశారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ద వహించవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ఆర్.కె డయాగ్నోస్టిక్స్ వారి సౌజన్యంతో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి డయాబెటిస్, కార్డియక్ స్క్రీనింగ్, బ్లడ్ షుగర్, ఈసీజీ, ఫిజీషియన్ తదితర టెస్టులు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితోపాటు ఎస్పీ కూడా వైద్య పరీక్షలు చెపించుకున్నారు.


ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోక తప్పదని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారైనా ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.


సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఎస్పీ తీసుకుంటున్న శ్రద్ధ విశేషమైనదని, ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసినందుకు అధికారులు, సిబ్బంది.. ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, నవీన్ కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed