ఈటల రాజేందర్ రాజకీయ బ్రోకర్: జీవీఆర్

by Dishanational1 |
ఈటల రాజేందర్ రాజకీయ బ్రోకర్: జీవీఆర్
X

దిశ, మానకొండూర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ రాజకీయ బ్రోకర్ అని కరీంనగర్ సుడా ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూరులోని సుడా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లను విమర్శించడమే ఈటల రాజేందర్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఆర్ లకు ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజక ప్రజలకు దూరంగా ఉంటూ తన ఉనికి కోసం వారిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. దళితుల దేవాలయ భూములను ఖబ్జా చేసిన చరిత్ర ఈటలదే అన్నారు.

చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజక వర్గాల్లో (స్ట్రీట్ కార్నర్) కూడలి సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. ఈటల, బీజేపీ నేతల వ్యాఖ్యలపై జీవీ రామకృష్ణారావు నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాఫ్ అయిందని, కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని దూషించడానికి మాత్రమే యాత్రను పెట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలను ఎలా కూల్చాలి, ఆదానీ, అంబానీలకు దేశ సంపదను ఎలా కట్టబెట్టాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ముందంజలో ఉందని తేల్చి చెప్పారు. నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించిన ఘనత తమదేనన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, స్థానిక సర్పంచ్ పృథ్వీరాజ్, పార్నంది కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed