ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

by Disha Web Desk 1 |
ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
X

దిశ, కరీంనగర్ టౌన్: వరిధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించి, కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. శనివారం కొత్తపెల్లి ఐకేపీ కొనుగోలు సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రబీ సీజన్లో జిల్లాలో వరి రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు సెంటర్లను ప్రారంభించి వెంటనే కొనుగోళ్లు జరపాలన్నారు.

గత పదిహేను రోజుల నుంచి ధాన్యం మార్కెట్ కు వస్తున్నా.. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎర్రటి ఎండలో ఎదురుచూస్తున్నారని అన్నారు. కొంతమంది రైతులు సమయానికి కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో దళారీలకు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా కొనుగోలు సెంటర్లలో టెంట్లు, మంచినీటి సౌకర్యం, గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు, సుతిల్ దారం అందుబాటులో ఉంచాలన్నారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో 353 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాల్సి ఉండగా కేవలం కొన్ని సెంటర్లు మాత్రమే ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ప్రారంభించిన సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆరోపించారు. వెంటనే అంతటా కొనుగోలు సెంటర్లు ప్రారంభించి, కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బు జమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీమా సాహెబ్, కరీంనగర్ రూరల్ జోన్ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, జె.అంజయ్య, కే.స్వామి, మల్లారెడ్డి, మణిదీప్, వి.స్వామి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed