ధర్మపురిలో చిన్నారిపై కుక్కల దాడి

by Disha Web Desk 1 |
ధర్మపురిలో చిన్నారిపై కుక్కల దాడి
X

సమస్యతో బెంబేలెత్తుతున్న పట్టణవాసులు

దిశ, వెల్గటూర్ : ధర్మపురి పట్టణంలో నెల రోజుల క్రితం ఓ చిన్నారిపై జరిగిన కుక్కల దాడి ఘటన మరిచి పోకముందే సోమవారం ఐశ్వర్య అనే మరో చిన్నారిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారులపై వరుసగా కుక్కలు దాడులు చేస్తున్నా.. అధికారులు, నేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధర్మపురి పట్టణంలోని గోపికృష్ణ థియేటర్ వెనకాల ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన బొల్లారపు అనూష, అనిల్ కూతురు ఐశ్వర్య (4)పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఎండ వేడిమి తగ్గిన వెంటనే చిన్నారి ఇంటి నుంచి బయటకు వచ్చి గేటు ముందే ఆడుకుంటుంది. ఈ క్రమంలో చిన్నారిపై అకస్మాత్తుగా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి ఏడుపు విని తక్షణమే ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుక్కలను తరిమేశారు. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

స్థానిక ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో చిన్నారి తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. హైదరాబాదులోని అంబర్ పేటలో జరిగిన ఘటనే పునరావృతమయ్యేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మపురి వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల భయంతో పిల్లల్ని నమ్మి బయటకు పంపించలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed