బీజేపీలో వర్గ పోరు.. మండల అధ్యక్షుల ప్రకటనతో బగ్గుమన్న విభేదాలు..

by Disha Web Desk 20 |
బీజేపీలో వర్గ పోరు.. మండల అధ్యక్షుల ప్రకటనతో బగ్గుమన్న విభేదాలు..
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి బీజేపీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కొత్త మండల అధ్యక్షుల నియామకం నియోజకవర్గ నాయకుల మధ్య మరింత దూరాన్ని పెంచింది. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలు ప్రెస్ మీట్ లు పెట్టి తిట్టుకునే స్థాయికి వెళ్లాయి. పెద్దపల్లి నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని అప్పటి నుండి నడిపిస్తున్న గుజ్జుల రామక్రిష్ణ రెడ్డి ఒక వైపు ఇదే నియోజకవర్గానికి చెందిన దుగ్యాల ప్రదీప్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రోద్బలంతో జిల్లా అధ్యక్షుడితో పాటు మండల అధ్యక్షుల నియామకాన్ని బుధవారం ప్రకటించడంతో విభేదాలు ఒక్కసారిగా బయటకొచ్చాయి. వీరి ఇరువూరితో పాటు మాజీ ఎంపీ వివేక్ సారథ్యంలో గొట్టిముక్కుల సురేష్ రెడ్డి తనదైన శ్రేణిలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

ఇటీవలే ఆయనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాలో చోటు దక్కింది. ఎవరికీ వారే చేస్తున్న కార్యక్రమాల్లో కార్యకర్తలు సైతం మూడు వర్గాలుగా విడిపోయారు. దుగ్యాల ప్రదీప్ రావు వర్గం నాయకులకే మండల పట్టణ అధ్యక్షులను ఇచ్చారని మాజీ మండల, పట్టణ అధ్యక్షులు గురువారం గుజ్జుల నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేనిది జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో లేని మండల అధ్యక్షుల నియామకం ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జండా మోస్తున్నమని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కాట్టబెట్టారని ఇది సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా జిల్లా అధ్యక్షుణ్ణే పెట్టారని దానిని ఏ బీజేపీ కార్యకర్త ఒప్పుకోరని అన్నారు. బూత్ స్థాయిలో అధ్యక్షుల నియామకం అయినా తర్వాతే వారి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలని ఇప్పుడున్న రాజేందర్ ని సస్పెండ్ చేయాలని అన్నారు. తమను తొలగించినట్టు ఇచ్చిన ప్రకటనని వెనక్కి తీసుకోని ఎలక్షన్ వరకు తమనే కొనసాగించాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్స సమ్మయ్య, ఎల్లేంకి రాజు, మామిడాల రమేష్, శ్రీనివాసరెడ్డి, శనిగరం రమేష్, ఎండీ పహీం తదితరులు పాల్గొన్నారు.


Next Story