నూతన విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు తప్పని తిప్పలు

by Disha Web Desk 6 |
నూతన విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు తప్పని తిప్పలు
X

దిశ, మల్హర్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమం భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలంలో చతికిలబడింది. మొదటి దఫాలో ఎంపికైన పాఠశాలల్లో పనుల ప్రారంభం, నిధుల మంజూరులో తీవ్ర జాప్యమే నెలకుంది. నిధులు మంజూరైనా కొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభమై మిగిలిన పాఠశాలల్లో ఆలస్యం జరుగుతుంది.

మరోవైపు పాఠశాలలు పునః ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుండడం, ఈ నెల మొదటి వారంలోనే బడిబాట కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవి సెలవుల్లో బడుల్లో మౌళిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ కు దీటుగా మారిస్తే ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది. పెండింగ్​ పనులు వేసవి సెలవులలోపు పూర్తి చేయాలని, లేకుంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

అరకొర నిధులు.. పాత భవనాలకు పూతలు..

మండలంలో 35 పాఠశాలలకు 14 పాఠశాలలను మన ఊరు- మన బడిలో ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల అభివృద్ధి కోసం రూ.2 కోట్ల 16 లక్షల పైచిలుకు నిధులు మంజూరు చేశారు. అరకొర నిధులతో పాత భవనాలకు కొత్త పూతలు, పగుళ్లు బడిన గోడలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేస్తున్నారు. చిన్నతూండ్లలో ప్రాథమిక పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణం లో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. జిల్లా పరిషత్ పాఠశాలలో డైనింగ్ హాల్ పనులు గోడల దశలో ఉండగా కిచెన్ షెడ్స్ నిర్మాణం మాత్రం బేస్మెంట్ లెవెల్ లోనే దర్శనమిస్తున్నాయి.

మన ఊరు-మన బడి లో ఎంపికైన పాఠశాలల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.1.60కోట్ల నిధులతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్, నీటి సౌకర్యం, తాగునీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు పనులు పూర్తి కాలేదు. అరకొరగా నిర్మించిన సిమెంట్ పనుల్లో నాణ్యత పాటించకుండా నాసిరకంగా చేపట్టి చేతులు దులుపుకున్నారు.

వల్లెం కుంట పాఠశాలలో కూలిపోయిన కాంపౌండ్ వాల్​ నిర్మాణం పూర్తి చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లేక గుత్తేదారుల ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తిచేసినా కొంతమేర అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు రాక, పూర్తి పనులు చేయలేక గుత్తేదారుడు చేతులెత్తేయడం తో పాఠశాల ఆవరణలో మట్టి పెల్లలు, పాత గోడల ఇటుకలు, డస్ట్ తో దర్శనమిస్తున్నాయి.

అదనపు గదుల ఊసేది?

ప్రస్తుతం మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని మన ఊరు మనబడి ప్రణాళిక కింద నిర్ణయించారు. కానీ నిధులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో అదనపు గదులను చేపట్టేందుకు అంచనాలు రూపొందించలేదు. కేవలం చిన్నచిన్న మరమ్మతు పనులతో పాటు మౌలిక సౌకర్యాలకు మాత్రమే నిధులు వెచ్చించినట్లు తెలిసింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలను విస్మరించారు. కనీసం ఆ పాఠశాలలో చిన్న చిన్న పనులకు కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం.

చదువులకు ఆటంకం కలగకుండా..

మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టే పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేస్తేనే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. లేకుంటే చదువులకు ఆటంకం ఏర్పడుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి అర్ధాంతంగా నిలిచిపోయిన పనులు బడులు పునః ప్రారంభం కాకముందే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story