ధర్నాలో బాహా బాహికి దిగిన నియోజకవర్గ నేతలు

by Disha Web Desk 9 |
ధర్నాలో బాహా బాహికి దిగిన నియోజకవర్గ నేతలు
X

దిశ, జడ్చర్ల: అధికార దీటుగా పార్టీని బలోపేతం చేయవలసిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవుతున్నారు. నియోజకవర్గంలో నామ మాత్రం గా ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొంత మెరుగుపడుతూ వస్తున్నప్పటికీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనకకు పడుతున్నాయి అన్న చందంగా పార్టీ పరిస్థితులు ఉంటున్నాయి.

జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గంలో తమ బలగాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలలో గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఉన్న కొద్ది మంది నాయకులు పార్టీని భాగాలుగా చేసుకొని ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గానికి చెందిన నాయకులకు జిల్లా, రాష్ట్రస్థాయి నేతల అండదండలు ఉండడంతో ఎవరికి వారుగా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒకే చోట నిర్వహించిన ఎడమొహం పెడముఖంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ‘టిఎస్పి‌యెస్’ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో వేదిక వద్ద కూర్చుని విషయంపై మున్సిపల్ కౌన్సిలర్ కుమ్మరి రాజు, బిజెపి నాయకురాలు బాలా త్రిపుర సుందరి మధ్య వాదన జరిగింది. ఈ వాదన పత్రికా భాషకు అందని మాటలతో సాగడం.. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. పార్టీ ముఖ్య నాయకులు కొందరు కల్పించుకొని ఇరువురిని శాంతింప చేశారు. బాలా త్రిపుర సుందరి తనను అవమానపరిచిందని ఆరోపిస్తూ జిల్లా నేతలకు ఫిర్యాదు చేయగా, తనను పలు సందర్భాలలో అవమాన పరుస్తున్నారని బాల త్రిపుర సుందరి ఆరోపిస్తోంది. పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నాయకుల మధ్య సఖ్యతను కుదుర్చి పార్టీని బలోపేతం చేయాలని పలువురు నాయకులు కార్యకర్తలు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed