ఎస్‌ఐపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు..

by Disha Web Desk 13 |
ఎస్‌ఐపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు..
X

దిశ, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన రైతు బోడకుంట శంకర్ పొత్కపల్లి ఎస్సై సివిల్ వివాదంలో తలదూర్చి తనను అకారణంగా వేధిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓదెల గ్రామంలో తమకు వారసత్వంగా వచ్చిన భూమి పై తమ సమీప బంధువు బోడకుంట తిరుపతి తో ఏర్పడిన తగాదా విషయంలో పొత్కపల్లి ఎస్ఐ అకారణంగా సివిల్ పంచాయతీ లో తలదూర్చి పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకుని బెదిరించారని ఆరోపించారు. ప్రత్యర్థి బోడకుంట తిరుపతి తో రాజీ కుదుర్చుకోవాలని ఎస్సై ఒత్తిడి చేశారని తాను అందుకు అంగీకరించకపోవడంతో తనపై అన్యాయంగా కేసు బనాయించి మండల మేజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేయించారని తెలిపారు. సివిల్ తగాదాలో తమ ప్రత్యర్థి అయిన తిరుపతి తో చట్ట విరుద్ధంగా కుమ్మక్కై ఎస్ఐ అధికార దుర్వినియోగానికి పాల్పడినందున అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేశాడు.

బాధితులకు న్యాయం చేస్తాం పొత్కపల్లి ఎస్సై మహేందర్ యాదవ్ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు బాధితుడు వచ్చి ఫిర్యాదు చేస్తే దీనిపై విచారణ చేపట్టిన అనంతరం రుజువైన తర్వాత నే కేసు నమోదు చేస్తానే తప్ప నిందితులను కాపాడే వ్యవస్థ పోలీసులకు ఎప్పుడు లేదని ఆయన అన్నారు. ఓదెల మండల కేంద్రానికి చెందిన బోడ కుంట తిరుపతి తన సొంత భూమిని, అదే గ్రామానికి చెందిన బోడ కుంట శంకర్ భూమిని అమ్మనివ్వడంలేదని, గత కొన్ని రోజుల నుంచి తనను సతాయిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బైండోవర్ చేశామని ఎస్ఐ మహేందర్ యాదవ్ తెలిపారు. ఫిర్యాదు చేసినంత మాత్రాన ఎవరిపై వెంటనే కేసు నమోదు చేయమని విచారణ అనంతరం నిజనిజాలు తెలుసుకున్న తర్వాత కేసు పెడతామని తెలిపారు.


Next Story

Most Viewed