పెద్దపల్లి BRSలో నయావార్.. తగ్గేదేలే అంటున్న ఆ నాయకులు

by Dishanational2 |
పెద్దపల్లి BRSలో నయావార్.. తగ్గేదేలే అంటున్న ఆ నాయకులు
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా బీఆర్​ఎస్​ పార్టీలో నయావార్​ మొదలైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఒక వైపు, ఎన్నికల్లో టికెట్​ ఆశిస్తున్న వారు మరోవైపు అన్నట్టు సాగుతోంది రాజకీయం. పెద్దపల్లి ఎమెల్యే దాసరి మనోహర్​ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా పరిషత్​ చైర్మన్​ పుట్ట మధులు ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉండగా, వారి నియోజకవర్గాల్లో టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారిని కట్టడి చేయడానికి ఐక్యతా రాగం అందుకుంటున్నట్లు కనిపిస్తుంది. మండలిలో చీఫ్​ విప్ గా ఎన్నికైన భానుప్రసాద్​ రావుకు ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి మద్దతు పలకడంతో బీఆర్​ఎస్​ పార్టీ పెద్దపల్లి జిల్లాలో సిట్టింగులు వర్సెస్​ ఆశావాహులు అన్నట్లు కనిపిస్తుంది.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరి మనోహర్​ రెడ్డి ఎన్నిక కాగా రామగుండం నియోజకవర్గం నుంచి ఆల్​ ఇండియా ఫార్వాడ్​ బ్లాక్​ పార్టీ నుంచి కోరుకంటి చందర్​ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత చందర్​ బీఆర్​ఎస్​ పార్టీలో చేరగా, మంథని నుంచి పోటీ చేసిన పుట్ట మధు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్ట మధు జిల్లా పరిషత్​ చైర్మన్​ అయ్యాడు. మూడు నియోజకవర్గాల నుంచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధిష్టానం ఆశీస్సులతో పుట్ట మధు, మనోహర్​ రెడ్డి, చందర్ బీఆర్​ఎస్​ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తున్నారు.

మూడుచోట్ల కొరకరాని కొయ్యలుగా..

వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ నుంచి టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మూడు నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారు ముగ్గురు నేతలకు కొరకరాని కొయ్యలుగా మారారు. బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దపల్లి నియోజకవర్గంలో మరీ ఎక్కువ అయింది. ప్రస్తుతం సిట్టింగ్​ ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి ఉండగానే జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్​, ఈద శంకర్​ రెడ్డి, నల్లా మనోహర్​ రెడ్డి, చిరుమల్ల రాకేష్​, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రఘువీర్​సింగ్, పెంట రాజేష్​​ తదితరులు పెద్దపల్లి బీఆర్​ఎస్​ పార్టీ టికెట్​ ఆశిస్తున్నారు. టికెట్​ ఆశిస్తున్న నాయకులు ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వారు అందరు తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు.

సిట్టింగ్​ ఎమ్మెల్యే ఉన్నచోట వచ్చే ఎన్నికల్లో టికెట్​ తమకే వస్తుందని చెప్పుకోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోపాటు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి వచ్చే ఎన్నికల్లో రామగుండం బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్నారు. పోలీస్​ హౌజింగ్​ బోర్డు చైర్మన్​గా ఉన్న కోలేటి దామోదర్​తో పాటు సింగరేణిలో బీఆర్​ఎస్​ పార్టీ అనుబంధంగా పని చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు మిర్యాల రాజి రెడ్డి, రామగుండం మున్సిపాల్​ కార్పొరేషన్​ మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి 2018లో పోటీ చేసి ఓటమి చెందిన పెద్దపల్లి జిల్లా పరిషత్​ చైర్మన్​ పుట్ట మధు వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తుండగా కాటారం మండలానికి చెందిన చల్ల నారాయణ రెడ్డి, కర్రు నాగయ్యతో పాటు నీటి పారుదల శాఖలో పని చేస్తున్న ఓఅధికారి సైతం టికెట్​ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

కట్టడి చేయకపోతే కష్టమే..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్​ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే చందర్​లు గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న తీరు జిల్లాలో పలుమార్లు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముగ్గురు మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ఇప్పుడు ఐక్యతా రాగం అందుకున్నట్లు కనిపిస్తుంది. మండలిలో ప్రభుత్వ చీఫ్​విప్​గా ఎన్నికల భానుప్రసాద్​ రావుకు పెద్దపల్లిలో ఇటీవల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా టికెట్​ ఆశిస్తున్న వారిని ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్​ పుట్ట మధు చేసిన వ్యాఖ్యలకు మనోహర్​ రెడ్డితో పాటు చందర్​ ఏకీభవించారు. టికెట్​ ఆశిస్తున్నవారు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారిని కట్టడి చేయాలని మంత్రి గంగులకు, ప్రభుత్వ చీఫ్​ విఫ్​ భానుప్రసాద్​ రావుకు మధు విజ్క్షప్తి చేశారు. పుట్ట మధు మాటలను ఎమ్మెల్యే దాసరి సమర్ధించడంతో సిట్టింగ్​లు ఒక వైపు టికెట్​ ఆశిస్తున్న వారు మరోవైపు అయినట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఆశిస్తున్నవారు మాత్రం తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తు వారు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించడం పెద్దపల్లిలో బీఆర్​ఎస్​లో నయావార్​ మొదలైనట్లు కనిపిస్తుంది.

Next Story

Most Viewed