రైతన్నలారా.. ఇకనైనా మారండి: కేంద్రమంత్రి బండి సంజయ్

by Kodari Anjali |

జమ్మికుంట కేవీకేలో ‘ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు.

రైతన్నలారా.. ఇకనైనా మారండి: కేంద్రమంత్రి బండి సంజయ్
X

దిశ, జమ్మికుంట: రసాయన ఎరువుల ద్వారా పండిస్తున్న పంటలను కొని తినడమంటే... పైసలిచ్చి రోగాలను కొని తెచ్చుకోవడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులంతా రసాయన ఎరువుల వాడకాన్ని విడనాడి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చే పంటకు మద్దతు ధర రాదనే బాధ అక్కర్లేదన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసిన రైతులు కోటీశ్వరులు అయ్యే అవకాశముందన్నారు. కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమన్నారు. మోదీ 4400 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో ఆయన స్పూర్తితో రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఝాన కేంద్రంలో ‘‘ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులను..

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మీ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షలు గంగాడి క్రిష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యులు విజయపాల్ రెడ్డి, సీనియర్ సైంటిస్టు వెంకటేశ్వర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు మహిపాల్ రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను, ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. భూమి పూజ చేశారు. మొక్క నాటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందరుకు కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న కృషిపై ఆరా తీశారు. గోమాత, భూమాత, భరతమాత... నినాదంతో మూడేళ్లపాటు 6 వేల 18 మంది రైతులతో 19 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రాబోయే రోజుల్లో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులను, సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. ఈ దేశంలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తానని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు స్పూర్తితో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాబోయే రెండేళ్లలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తా.. జమ్మికుంట కేవీకే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని తెలిపారు.

Next Story